గుంటూరు, జనవరి 27: ప్రత్యేక హోదాపై పోరుకు జనసేనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలసి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఆదివారం గుంటూరులో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎల్ఇఎం స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన జనసేన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కేంద్రంపైన ఐక్య పోరాటం చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో విడివిడిగా పోటీ చేద్దాం. ఎలా పోటీ చేద్దాం అనేది తర్వాత చూద్దాం అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును సినిమా పాత్ర ‘గజని’తో పోలుస్తూ, ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోతుంటారనీ, హోదా విషయం గుర్తుకు రాగానే మళ్ళీ మాట్లాడతారని విమర్శించారు.
చంద్రబాబుకు, జగన్కు తనకు వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
జగన్ సిఎంగా 30ఏళ్లు ఉంటానంటే కుదరదన్నారు. మోదీ ప్రత్యేకహోదా గురించి మరిచిపోయారన్నారు. ముఖ్యమంత్రి గజినిలా మర్చిపోయి మళ్లీ గుర్తు చేసుకుంటారు. జగన్ పూర్తిగా మర్చిపోయారన్నారు. ప్రత్యేక హోదాపై పోరుకు రావాలన్నారు. ప్రధాన మంత్రి మోది కూడా హోదా గురించి మరచిపోయారని ఆయన పేర్కొన్నారు.
హోదా, విభజన హామీలకోసం కేంద్రాన్ని నిలదీస్తానని, తాను పల్నాటి పౌరుషాన్ని గుండెల్లో నింపుకున్నాననీ ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ను రెండుగా విభజించిన విధంగానే రానున్నకాలంలో ఉత్తరప్రదేశ్ను నాలుగు ముక్కలు చేస్తారని ఆయన తెలిపారు. ఆ రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు. మన రాష్ట్రానికి పట్టిన గతే యూపికి పడుతుందని ఆయన తెలిపారు.
అమరావతిలో జనసేన జెండాను ఎగురవేస్తామని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల తర్వాత జనసేన ప్రభుత్వాన్ని నెలకొల్పే విధంగా ముందుకు వెళదామని ఆయన చెప్పారు. యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నిర్వీర్యం అవుతున్నారనీ, జనసేన అధికారంలోకి రాగానే యువతే ఉద్యోగాలు ఇచ్చేవిధంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
మేధావులు రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నారనీ, వ్యవస్థను సంపూర్ణంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ ఆయన అన్నారు.
కార్యకర్తలమీద చెయ్యివేస్తే తోలుతీస్తానని ఆయన హెచ్చరించారు. హసన్ అనే కార్యకర్త తాను జనసేన పచ్చబొట్టు వేసుకుంటే దాడి చేసి బెదిరిస్తున్నారని సభ చివర్లో పవన్ ధృష్టికి తీసుకురావడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.
గుంటూరులో తోట చంద్రశేఖర్ విజయకేతనం ఎగురవేస్తారని ఆయన చెప్పారు.
రాజకీయాల్లోకి రావాలని 2003లోనే నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకోసం ప్రాణాలను సైతం లెక్కచేయనని ఆయన అన్నారు. వారసత్వ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటామని ఆయన చెప్పారు.
అవినీతిపైన అలుపెరుగని పోరాటం చేస్తానని చెప్పారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రి అధ్వాన్నంగా ఉందనీ, నగరంలో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందనీ ఆయన వ్యాఖ్యానించారు.
వర్షం కురుస్తున్నప్పటికీ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి పవన్ ప్రసంగం అయ్యేవరకు ఉన్నారు.