Janasena-Bjp : జనసేన-బీజేపీ Janasena-Bjp పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇక్కడే అనేక సందేహాలు ఉన్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేనతో కలసి వస్తోంది. ఏపీలో పొత్తు కొనసాగుతోంది. కానీ.. తెలంగాణలో మాత్రం జనసేనతో బీజేపీ అంతగా కలిసున్నట్టు లేదు. ఆమధ్య తిరుపతిలో పవన్ పర్యటించిన సందర్భంలో కూడా ఏపీలో జనసేనతో బీజేపీ అవమానిస్తోంది.. సహకరించట్లేదు అన్నారు. మరునాడే బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగి సోము వీర్రాజు పవన్ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ఇలా అతుకులబొంతగా తయారైన జనసేన-బీజేపీ పొత్తు ఇప్పుడు తెలంగాణలో కటీఫ్ అయినట్టే అనిపిస్తోంది. ఇందుకు పవన్ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో జరిగిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు ఉన్నా.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె పీవీ సురభి వాణికి మద్దతిస్తున్నట్టు తెలిపారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తమతో ఉన్నా తెలంగాణ బీజేపీ మమ్మల్ని అవమానించింది. అందుకే టీఆర్ఎస్ అభ్యర్దికి మద్దతిస్తున్నామని తెలిపారు. ఇదే ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ బీజేపీకి, ఏపీ బీజేపీకి హెడ్.. బీజేపీ కేంద్ర నాయకత్వమే. మరి కేంద్ర నాయకత్వానికి ఎదురెళ్లి తెలంగాణ బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ ఎఫెక్ట్ జనసేన-బీజేపీ మితృత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పాలి.
పవన్ కు సినిమా ఇమేజ్ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పే పని లేదు. సమాజం గురించి నిత్యం ఆలోచించే పవన్ 2014 మార్చి 14న జనసేన పార్టీ స్థాపించారు. నేటితో పార్టీ 7ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లో జనసేన.. టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో కలిసి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తులో ఉన్నారు. కానీ.. జనసేనకు కేంద్రంలోని బీజేపీ నుంచి తప్ప రెండు రాష్ట్రాల బీజేపీ నుంచి ఆశించినంత స్నేహ హస్తం అందడం లేదు. ఇది గమనించే పవన్ తెలంగాణలో బీజేపీకి వ్యతిరేక ప్రకటన చేశారని చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పంతం నెగ్గించుకుని తిరుపతిలో జనసేనకు అవకాశం ఇవ్వకపోవడం కూడా పవన్ ఆగ్రహానికి మరో కారణం. మరి.. రాబోయే రోజుల్లో జనసేన-బీజేపీ మితృత్వం ఎలా ఉంటుందో చూడాలి.