Ap Politics: ఏపీపాలిటిక్స్ Ap Politics ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. పార్టీల ఆధిపత్యం.. నాయకుల క్రేజ్ లేదంటే కుల వ్యవస్థ. ఇవి పాలిటిక్స్ లో సహజమే అయినా.. ఏపీలో మరింత ఎక్కువ అని చెప్పాలి. తమిళనాడు తరహాలో రాజకీయాలపై సినీ ప్రభావం కూడా ఎక్కువే. ఎన్టీఆర్ తర్వాత ఆస్థాయిలో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చింది చిరంజీవి మాత్రమే. ఆయన తర్వాత మళ్లీ వీరిద్దరి స్థాయిలో సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చింది పవన్ కల్యాణ్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సినిమాలూ అలానే చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయమే. అయితే.. పవన్ పార్టీ పెట్టిన ఈ ఏడేళ్లలో అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీతో పొత్తుతో ఉన్నారు. అయితే.. ఈ పొత్తు కూడా ఎన్నాళ్లో ఉండదని కొన్ని పత్రికలు బాహాటంగానే ప్రచారం చేస్తున్నాయి.
పలుకుల్లోనే విద్వేషం..
ప్రస్తుతం జనసేన – బీజేపీ పొత్తులో ఉన్నాయి. కాస్తంత విబేధాలు ఉన్నాయనే పవన్ వ్యాఖ్యలతో ఆమధ్య సోము వీర్రాజు డ్యామేజ్ కంట్రోల్ చేశారు. ఇదే ఇప్పుడు కొందరికి ఆయుధంగా మారింది. ఓ పత్రిక వీరి మైత్రిపై వ్యాఖ్యలు చేసింది. పవన్ ఎప్పుడెప్పుడు బీజేపీని వదిలించుకుందామా అని చూస్తున్నారని రాసింది. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన బలంతో బీజేపీ ఎందుకు అని జనసేన నేతలు, జనసైనికులు పవన్ పై ఒత్తిడి తెస్తున్నారని కూడా రాసింది. ఆ రాతల్లో పవన్ తో బీజేపీకి బలవంతపు తెగతెంపులు చేయించేసి.. అర్జంట్ గా టీడీపీతో జత కట్టించేసి.. కనీసం మరో మూడేళ్ల తర్వాత ముడి పెట్టేసేందుకు ఇప్పుడే పునాదులు వేస్తున్నట్టు ఓ చిన్న పలుకు పలికేసింది. తాను రాసింది మాత్రమే వేదం.. చదావాల్సిందే.. అనే రీతిలో వారానికోసారి రాసే ఆ పలుకుల్లో ఇప్పుడు జనసేనపై పడింది. ప్రజల్లో లేని ఆలోచనలను తమకొచ్చిన ఆలోచనలను రుద్దే ప్రయత్నమే ఇది. బీజేపీతో జనసేనకు పొసగట్లేదు.. మళ్లీ టీడీపీతో జత కట్టించి 2024 ఎన్నికలకు కూటమిని సిద్ధం చేయించాలనే ఆలోచనే అనిపిస్తుంది.
టీడీపీ కోసం భుజం కాస్తున్నారా..?
సొంతంగా టీడీపీ ఎన్నికలకు వెళ్తే పరిస్థితి ఏంటో తేలిపోయింది. దీంతో టీడీపీ బయట పోరాడుతుంటే.. మీడియా ముసుగులో ఇలా జ్యోతులు వెలిగిస్తున్నట్టుగా మంటలు పెట్టేస్తున్నారు.. రాతల్లో. నిజంగానే జనసేనకు బీజేపీ నుంచి దూరమవ్వాలి అనుకుంటే.. టీడీపీతోనే ఎందుకు కలవాలి. సొంతంగానే వెళ్తుంది కదా..! పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు గెలచుకున్న లెక్కలు చూస్తే గ్రామస్థాయిలో ఆ పార్టీకి బలం ఎంతోకొంత పెరిగిందనే చెప్పాలి. పార్టీ అగ్రనాయకత్వం అండ మాత్రమే ఉండి.. క్షేత్రస్థాయిలో జనసైనికులు పోరాడిన తీరు అద్వితీయం. ఇదే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో జనసేనను మూడో పెద్ద పార్టీగా గుర్తింపు దక్కేలా చేసింది. ఇదంతా పవన్ పై జనసైనికులకు ఉన్న అభిమానం.. ఆయన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకమే కారణం. ఇలా తన ఉనికిని కష్టపడి కాపాడుకున్న జనసేన మళ్లీ టీడీపీతో మద్దతు పెట్టుకుని కూర్చున్న కొమ్మను నరుక్కుంటుందా? జనసైనికులు ఊరుకుంటారా? ఇదే జరిగినే పవన్ ను మళ్లీ ప్రజలు విశ్వసిస్తారా? పవన్ కు ఈ విషయం తెలియదా?
పవన్ కూ తెలిసింది.. తన సత్తా
మరి జ్యోతులు వెలిగిస్తున్నామనే భ్రమలో ఉన్న ఆ రాత ఉద్దేశం.. టీడీపీకి జనసేన సహకరించాలి.. అలా చేసేయాలి అనే? అంటే జనసేన ఎప్పుడూ సపోర్టివ్ క్యారెక్టర్ లానే ఉండాలని వారి ఉద్దేశమా? అధికారం వైపు పవన్ కల్యాణ్ జనసేన అడుగులు వేయకుండా.. టీడీపీ అడుగులకు మడుగులు ఒత్తాలా? ఇదేనా ఆయన రాతల్లోని అర్ధం? ఇప్పటికే 2014లోనే తప్పు చేశాం అని పవన్ గతంలోనే వ్యాఖ్యానించారు. 2019లో సొంతంగా వెళ్లి భవిష్యత్తులో ఎలా ఉండాలో తెలిసుకున్నారు. ఇంత నేర్చుకుని 2024లో టీడీపీతో జత కడతారా? ఆ పలుకుల్లోని రాతలు పవన్ ఇలానే ఉండాలని రాస్తున్నట్టున్నాయి. పవన్ క్రేజ్ ను వాడుకుని గతంలో ఓసారి వదిలేశారు. అప్పుడంటే కొత్తగా వచ్చిన పార్టీ. ఇప్పుడు జనసేన పెరిగింది. పవన్ కూ రాజకీయం తెలిసొచ్చింది. ఎవరేంటో ఆయనకూ తెలుసు. ఆ జ్యోతికి ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాలో పవన్ ను ఎలా చూపిస్తారో కూడా తెలుసు. ఇంత తెలిసి ఈ రాతల్లోని ట్రాప్ లో పవన్ ఎలా పడతారు? ఆ పలుకుల అధిపతికే తెలియాలి..!