కాకినాడ: ఇసుక సమస్య కారణంగా రాష్ట్రంలో పనులు లేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు టిడిపి లక్ష రూపాయల చెప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ తెలిపారు. కాకినాడ జిజిహెచ్లో ఆత్మహత్యకి పాల్పడిన వీరబాబు భౌతికకాయాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. మృతుడి భార్య, పిల్లలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న వీరబాబు భార్య దుర్గ తమ ఆవేదనను లోకేష్కు వివరించింది. ఐదు నెలలుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామనీ, కుటుంబ పోషణకు తన భర్త సైకిల్, తన మెడలోని మంగళ సూత్రాలను సైతం తాకట్టు పెట్టి అప్పులు చేశామనీ దుర్గ ఆవేదనతో తెలియజేసింది. కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. అనంతరం కాకినాడు టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైసిపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత అనేది మొదటి సారి వింటున్నానని లోకేష్ అన్నారు.ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం గతంలో ఎప్పుడూ లేదని లోకేష్ పేర్కొన్నారు. చేతగాని ప్రభుత్వం వల్ల 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో ఉచిత ఇసుక ఇస్తే అవినీతి జరిగిపోతుంది అని వైసిపి నాయకులు ఆరోపించారని లోకేష్ అన్నారు.
వరద వల్ల ఇసుక అందుబాటులో లేకపోతే మన రాష్ట్రంలోని ఇసుక చెన్నై,బెంగుళూరు,హైదరాబాద్లకు ఎలా వెళ్తుందని లోకేష్ ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేననీ, ఆత్మహత్య చేసుకున్న 38 మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రెషియా ఇవ్వాలని లోకేష్ డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికులకు నెలకి 10 వేల రూపాయల చొప్పున అయిదు నెలలకు 50 వేలు పరిహారంగా ఇవ్వాలని లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసిపి తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ట్రాక్టర్ ఇసుక ధర 6 వేల రూపాయల నుండి 10 వేల రూపాయలు అయ్యిందనీ, అదే మాదిరిగా లారీ ఇసుక 60 వేల రూపాయల నుండి లక్ష రూపాయలకు అమ్ముతున్నారని లోకేష్ వివరించారు. ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి తీసుకురావాలని లోకేష్ కోరారు. ఇసుక సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని లోకేష్ హెచ్చరించారు.
కాకినాడలో నిన్న ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు కుటుంబాన్ని ఈరోజు పరామర్శించాను. ఇసుక కొరతతో పనుల్లేక కార్మిక కుటుంబాలు ఇలా చితికి పోవడం చూసి మనసుకు బాధగా అనిపిస్తోంది. pic.twitter.com/aNkpAR45L8
— Lokesh Nara (@naralokesh) November 5, 2019