Ntr Vangaveeti: ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన ప్రభుత్వానికి కొత్త సమస్య తీసుకొస్తోంది. జిల్లాలకు మహనీయులు, ప్రముఖుల పేర్లు పెట్టాలని వస్తున్న డిమాండ్లే ఇందుకు కారణం. దీంతో ప్రభుత్వ పెద్దలకు కొత్త తలనొప్పి మొదలైంది. జిల్లాలకు పెట్టే పేర్ల విషయంలో మాత్రం ఎవరూ తగ్గేలా లేరు. ఇందులో ప్రముఖమైంది కృష్ణా జిల్లా. ఉమ్మడి ఏపీ నుంచీ ఈ జిల్లాకు రాజకీయ ప్రాధాన్యం ఎక్కువ. ఇప్పుడీ జిల్లాను రెండుగా విభజించి విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారు. జగన్ పాదయాత్రలో భాగంగా గుడివాడ పర్యటనలో ఉండగా ఇచ్చిన హామీ మేరకు సీఎం అయ్యాక హామీ నెరవేర్చారు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలనే కొత్త డిమాండ్ తో ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చింది.
ఇద్దరి పేర్లు సాధ్యమేనా..
ఎన్టీఆర్ గుడివాడ ప్రాంతంలోని నిమ్మకూరులో జన్మించారు. ఆ ప్రాంతం మచిలీపట్నం జిల్లాలో కలుస్తోంది. దీంతో ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కొందరు అంటున్నారు. మచిలీపట్నం జిల్లాలోనే కాపులెక్కువ ఉంటారు కాబట్టి ఆ జిల్లాకు రంగా పేరు పెట్టాలనేది మరో డిమాండ్. దీంతో ఒకే జిల్లాకు ఇద్దరు ప్రముఖుల పేర్లు పెట్టాలనే డిమాండ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయితే.. ఇప్పటికే ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ప్రకటించేశారు. దీంతో రెండు జిల్లాలో ఏదకొ జిల్లాకు రంగా పేరు పెట్టాలనే డిమాండ్ తో ఇప్పుడు కాపులు సంతకాల సేకరణ కూడా మొదలుపెడుతున్నారు. కృష్ణా జిల్లాలో కాపు-కమ్మ సామాజికవర్గాల జనాభా సమానంగానే ఉన్నా.. ఓట్లు, జనాభాపరంగా కాపులే కొంత ఎక్కువ ఉంటారని అంచనా.
కాపుల డిమాండ్..
అయితే.. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలనే డిమాండ్ వంగవీటి కుటుంబం ఎప్పుడూ చేయలేదని రంగా అనుచరులు చెప్తున్న మాట. గతంలోనే వినతిపత్రం ఇచ్చామనేది బంధువులు మాట. ఏదొక జిల్లాకు రంగా పేరు పెడితే రాధాకు రాజకీయ లబ్ది.. కాపులకు గౌరవం లభిస్తుంది. మరోవైపు నరసారావుపేటలో కూడా కాపుల సంఖ్య ఎక్కువ. ఈ జిల్లాకు స్వాతంత్ర సమరయోధుడు, కాపు నేత కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్లు వస్తున్నాయి. రాజకీయంగా కాపులు వైసీపీ వెన్నంటే ఉన్నారు కాబట్టి.. తమకు తగిన గౌరవం ఇవ్వాలని కాపు నాయకులు అంటున్నారు. మరి.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో నెల ఆగాల్సిందే..!