Tirupati by election: తిరుపతి ఉప ఎన్నిక Tirupati by election ఎర్రటి ఎండలో ఎన్నికల మంట రగులుతోంది. పార్టీలన్నీ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అయితే.. అంతకుమించి వాదనలు, దూషణలు, కౌంటర్లు, సెటైర్లు, చాలెంజ్ లు కూడా అన్ని పార్టీల మధ్య జరుగుతున్నాయి. ఎన్నికల హోరులో భాగంగా నిన్న టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల వీడియోను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అది మార్ఫింగ్ వీడియో అని పనబాక ఖండిస్తే.. లింక్స్ కూడా ఉన్నాయని సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. సునీల్ ధియోధర్ అయితే.. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందంటూ ఏపీని సీఎం జగన్ సర్వనాశనం చేసేశారని అన్నారు.
మరోవైపు విజయసాయి రెడ్డి బీజేపీ-జనసేనను కలిపి విమర్శించారు. ‘జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక అయితే.. కాబోయే సీఎం అంటూ రాష్ట్రంలో ఒక్క సీటూ లేని పార్టీ.. అసలు ఉనికిలో లేని పార్టీ బిస్కెట్ వేస్తోంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని.. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఏప్రిల్ 3న పవన్ తిరుపతి రానున్న పవన్ దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారనేద ఖాయమే. మరోవైపు.. నామినేషన్ పత్రాల్లో తనపై ఏ కేసు లేదని పేర్కొన్న బీజేపీ అభ్యర్ధి రత్నప్రభపై జనతాదళ్ (యు) నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇలా తిరుపతి ప్రచారంలో విమర్శలు, వాదనలు రోజుకో రకంగా మలుపు తిరుగుతున్నాయి.
ఇక తిరుపతిలో ఆసక్తికరంగా అనిపించిన అంశం.. బీజేపీ-జనసేన కలిసి పని చేయడం కాదు. ఈ రెండు పార్టీల్లో ఉన్న నేతల కలయిక గురించి అని చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ కు 1980ల్లో బద్ద శత్రువుల్లో ఒకరు నాదెండ్ల భాస్కర రావు. ఇప్పుడు.. వారి వారసులు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి బీజేపీ, భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ జనసేనలో ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ ఒకే వేదికపై ఉండి మిత్రపక్షాలుగా ఉన్న తమ పార్టీలు గెలవాని ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇటువంటివి విచిత్రాలే అనుకోవాలి. అయితే.. ఇంకా తిరుపతి ప్రచారంలో టీడీపీ యాక్టివ్ కాలేదెందుకో.. ? అనే చర్చ నడుస్తోంది.