న్యూఢిల్లీ: ఎన్నికలలో పరాజయానికి నైతక బాధ్యతగా తాను నాయకత్వంనుంచి తప్పుకుంటానని పట్టుబడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందరు చెప్పినా మనసు మార్చుకోవడం లేదు. పార్టీ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభంలో నాయకత్వ బాధ్యత నుండి వైదొలగడం సరికాదని సీనియర్లు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక రాజీ ఫార్ములా బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ నాయకత్వం వీడే విషయంలో మరోమాట లేదనీ, కావాలంటే లోక్సభలో పార్టీకి నాయకత్వం వహిస్తాననీ రాహుల్ ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఈ రోజు ఉదయం నుంచీ రాహుల్ గాంధీని సోదరి ప్రియాంక, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, మరి కొందరు నాయకులు కలిశారు. వీరి చర్చల పర్యవసానంగా ఈ ఫార్ములా రూపొందినట్లు చెబుతున్నారు. ఈ సాయంత్రం తన ఇంట్లోనే పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం కానున్నారు.
రాహుల్ను కలిసిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు తరుణ్ గొగోయ్ ఎన్డిటివితో మాట్లాడుతూ, ఆయన మనసు మారేట్లు లేదని చెప్పారు. పార్టీలో కొందరు సీనియర్ల పనితీరు పట్ల రాహుల్ చాలా అసంతృప్తిగా ఉన్నారని గొగోయ్ అన్నారు. యుద్ధం జరుగుతున్నపుడు సేనాపతి పారిపోవచ్చా అని అడిగినప్పుడు, తాము పారిపోవడం లేదనీ, పార్టీ బాధ్యత లేనపుడు మరింత గట్టిగా పోరాడుతాననీ రాహుల్ అన్నట్లు గొగోయ్ చెప్పారు.