అమరావతి: రాష్ట్రంలోని ప్రజలు చంద్రబాబు సర్కార్ను తిరస్కరించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కోరుకుంటున్నట్లు వైసిపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది.అయినా ఆ సంచలన దర్శకుడికి ఎపిలో తిప్పలు తప్పడం లేదు. ఆయన తలపెట్టిన మీడియా సమావేశానికి పోలీసులు అడ్డుపుల్ల వేశారు. ప్రెస్ మీట్పై రాంగోపాల్ వర్మ చేసిన బస్తీమే సవాల్ ప్రకటనకు విజయవాడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (శాంతి భద్రతలు) నోటీసు పంపారు.
ఆదివారం సాయంత్రం విజయవాడ పైపుల రోడ్డులో ఎన్టిఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నానంటూ రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై విజయవాడ పోలీసులు స్పందించారు.
ప్రధానంగా ఐదు అంశాలను నోటీసులో పేర్కొంటూ మీడియా సమావేశానికి ప్రత్యామ్యాయ స్థలాలను ఎంచుకోవాలని రాంగోపాల్ వర్మకు పోలీసులు సూచించారు.
‘మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం జరిగే స్థలం బహిరంగ ప్రదేశం అయినందున మిమ్మల్ని వ్యతిరేకించే వర్గం వారు మీ కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఘర్షణలు జరిగి ప్రాణ, ఆస్తినష్టం జరిగే అవకాశం ఉన్నందున మీరు తలపెట్టిన కార్యక్రమంపై పునరాలోచన చేసి అందరికీ అమోదయోగ్యమైన ప్రదేశంలో, ప్రెస్ క్లబ్లో కానీ ఏదైనా కాన్ఫరెన్స్ హాల్లో గానీ నిర్వహించుకోవలసిందిగా మనవి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
‘ప్రస్తుతం విజయవాడ నగర పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సిఆర్పిసి, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నాయి. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి కార్యక్రమాలు చేయుటకు అనుమతించబడవు’ అని తెలిపారు.
‘పోలీసుల హెచ్చరిక నోటీసుపై రాంగోపాల్ వర్మ ఇంత వరకూ స్పందించలేదు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ బయోపిక్ చిత్రీకరించారు. ఈ చిత్రం ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే రిలీజ్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో విడుదల కాలేదు. ఎన్నికలకోడ్ కారణంగా నిలుపుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి ఒక పర్యాయం రాంగోపాల్ వర్మ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే పోలీసులు అడ్డుకొని బలవంతంగా పంపించి వేశారు. ఈ ఘటనపై వైసిపి అధినేత, ప్రస్తుత కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నాటి ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని తప్పుబడుతూ ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.