క్రికెట్ లో ప్రత్యర్థుల భిన్నమైన బంతులను ఎదుర్కోవడంలో సచిన్ టెండూల్కర్ ఎటువంటి వ్యూహంతో బ్యాటింగ్ చేస్తారో అందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థుల ఎత్తులకు చిత్తులు చేస్తూ కొత్త ఎత్తులు వేస్తున్న ఈ సచిన్ గురించి మనం తెలుసుకోవాలి. రాజస్థాన్ లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అటు బీజేపీతో కూడా జత కట్టకుండా తనకు ఉన్న 19 మంది ఎమ్మెల్యే ల తో కాంగ్రెస్ పార్టీకి, బిజెపికి చుక్కలు చూపిస్తున్నది సచిన్ పైలెట్. రాజస్థాన్ రాజకీయంలో అనూహ్యంగా జాతీయ స్థాయికి ఎదిగిన సచిన్ పైలట్ వ్యూహాలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఉంచుతున్నారో, ఎప్పుడు ఏ నెంబర్ వాడుతున్నారో, తెలియకుండా తన వర్గం ఎమ్మెల్యేలను తిప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం అశోక్ గహ్లట్ కి ఏ మాత్రం దొరక్కుండా అదే రకంగా బిజెపికి కూడా చిక్కకుండా తమ 19 మంది ఎమ్మెల్యేలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అనేక విధాలుగా తిప్పుతున్నారు. పలు వ్యూహాలు అమలు చేస్తున్నారు.
రాజస్థాన్ లో ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు గవర్నర్ ఆమోదించారు. దీనితో సిఎం గెహ్లోత్ను దెబ్బతీయడానికి సచిన్ పైలట్ వేస్తున్న వ్యూహాత్మక అడుగులు ఆసక్తి కల్గిస్తున్నాయి. ఇప్పటి వరకూ తమ శిబిర ఎమ్మెల్యేలు ఉంటున్న రిసార్టులను ఒక్కసారిగా మార్చేశారు. అంతే కాకుండా ఆ 19 మంది ఎమ్మెల్యేల సెల్ ఫోన్ నెంబర్ల ను కూడా మార్చేశారు. వీరందర్నీ గురుగ్రామ్లోని ‘థర్డ్ ప్లష్’ రిసార్టుల్లోకి పంపించారు. ఎమ్మెల్యేల రక్షణ కోసం రిసార్టు చుట్టూ ప్రైవేట్ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరు వాడుతున్న సెల్ ల జీపీఎస్తో కూడా ట్రేస్ కాకుండా సచిన్ జాగ్రత్తలు తీసుకున్నారుట. ఇలా రిసార్టులు మారుస్తూ, ఫోన్ నెంబర్లు మారుస్తూ సిఎం గెహ్లోట్ కు చెమటలు పట్టిస్తున్నారు సచిన్ పైలట్. సచిన్ పైలట్ వ్యూహాత్మక అడుగులు గెహ్లోట్ వర్గీయులను ఆందోళన కల్గిస్తోంది. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు నడుమ రాజస్థాన్ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి మరి.