తాను చెప్పిందే వేదం.. తాను చేసేదే చట్టం.. అని భావించిన గత ప్రభుత్వాధి నేతకు, న్యాయం నేను చెప్పినట్టే జరుగుతుందని కలల్లో తేలిన మాజీ అడ్వొకేట్ జనరల్ కు షాకిచ్చింది సుప్రీంకోర్టు. అమరావతి భూ కుంభకోణంపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లను తప్పుబట్టింది. అమరావతిలో భూకుంభకోణం జరిగిందని గత టీడీపీ ప్రభుత్వంపై ఎందుకు ఆరోపణలు వచ్చాయో సుప్రీం ఆదేశాలు చెప్పాయి. అమరావతి భూఆక్రమాలపై నిజాలు తేల్చేందుకు సిద్ధమైంది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ హయాంలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కూడా భాగస్వామి అని ఆరోపించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లింది. కానీ.. దమ్మాలపాటికి అనుకూలమైన ఆర్దర్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ.. దమ్మాలపాటికి, హైకోర్టుకి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు.
ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీం స్టే ఇచ్చింది. “రాజధాని భూ కుంభకోణం కి సంబంధించి వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దు?, నేరం జరిగితే విచారణ జరపాల్సిన అవసరం లేదా?. కేసు వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దు. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు’’ అంటూ దిగువ న్యాయస్థానం వ్యవహరించిన తీరును ప్రభుత్వ తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ సుప్రీం ధర్మాసనం ముందు ప్రస్తావించారు.
న్యాయంపై నమ్మకం కలిగేలా..
హైకోర్టు తీర్పులను ప్రభావితం చేస్తున్నారన్న ఏపీ ప్రభుత్వ వాదనలకు గ్యాగ్ ఆర్డర్ పై స్టే ఇవ్వడంతో కాస్త బలాన్ని ఇచ్చాయనే చెప్పాలి. ఆరోపణల నేపథ్యంలో విచారణ అర్హత ఉన్న పటిషన్లకు కూడా హైకోర్టు నుంచి ఇటువంటి ఆర్డర్లు వస్తే న్యాయం ఎక్కడ.. అనే సామాన్యుడి సందేహానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు.. న్యాయంపై నమ్మకం కలిగించేవే. జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం జగన్ రాసిన లేఖను తప్పుబట్టిన వారందరికీ సుప్రీం ఆదేశాలు ఆలోచనలో పడేస్తాయని చెప్పాల్సిందే. ఈ అంశంపై తదుపరి విచారణను జనవరి చివరికి వాయిదా వేసింది. అప్పటివరకు కేసు ఫైనల్ చేయవద్దని హై కోర్టు కి సుప్రీం ఆదేశం ఇచ్చింది.