అమరావతి: రాష్ట్రంలో యథేచ్ఛగా డబ్బుల పంపిణీ జరుగుతుందని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బాబు, తదితరులు సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం కన్నామీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఈసి తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవట్లేదని మేము అంటుంటే…ఈసిని రాజకీయ పార్టీలకు అంటగట్టి బ్లాక్ మెయిల్ చేయటం చంద్రబాబు సహజ స్వభావమని కన్నా విమర్శించారు. టిడిపి ఒక పార్టీ కాదనీ, డ్రామా కంపనీ అని కన్నా వ్యాఖ్యానించారు. ఈసి దగ్గర చంద్రబాబు డ్రామాలాడారని కన్నా పేర్కొన్నారు.
సత్తెనల్లి నియోజకవర్గంలో పోలీసులే టిడిపి తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారని ద్వివేదీకి వివరించామన్నారు. అలాగే గుంటూరు పార్లమెంట్ సభ్యుని కార్యాలయం దగ్గర జర్నలిస్ట్ పై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వేల కోట్ల నల్లధనాన్ని అధికార పార్టీ పంచుతోందని జివిఎల్ ఆరోపించారు. ఇప్పటివరకూ 120 కోట్ల రూపాయలు పట్టుకున్నారని అభినందిస్తూ.. ఇది కేవలం కొండత అవినీతిలో గోరంతేననీ జివిఎల్ అన్నారు. ఇంకా చాలా నల్లధనం చేతులు మారుతోందని జివిఎల్ ఆరోపించారు.
ఈసి వంటి రాజ్యాంగ సంస్థపై రంగు పులిమి రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేయటం దుర్మార్గమని జివిఎల్ వ్యాఖ్యానించారు. కొద్ది మంది అధికారులను ఈసి బదిలీ చేస్తే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబు దిగజారుడు మాటలు రాజకీయ దివాళా కోరుతనమని జివిఎల్ దుయ్యబట్టారు. హైకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి రాలేదని అన్నారు. చంద్రబాబు ముందుగానే తన ఓటమిని అంగీకరించారని జివిఎల్ వ్యాఖ్యానించారు.
రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జివిఎల్ ఆరోపించారు. పోలింగ్ రోజున కూడా టిడిపి కుట్రలు పన్నే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జివిఎల్ సూచించారు. చంద్రబాబు కావాలనే సోదాలు చేయించుకున్నారనీ, రాష్ట్రంలో జరిగినవి ఐటి సోదాలు కాదనీ, పోలీసు సోదాలేననీ జివిఎల్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితే పారదర్శకంగా ఉండేవని జివిఎల్ అభిప్రాయపడ్డారు. ఈ సారి టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా రాదని జివిఎల్ జోస్యం చెప్పారు.