గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఒకే పార్టీలో మూడు వర్గాలు, మూడు భిన్న కార్యాచరణలతో కొట్టుకుంటూ కేసులు వరకూ వెళ్తున్నారు. టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీకి రాజకీయంగా ఎప్పుడూ లేని కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదాలు గొడవలు ఎందుకని ఓ సంచలన నిర్ణయం తీసుకునే విధంగా ఆలోచిస్తున్నారని ఆయన వర్గం అంటోంది.
రోజూ ఎక్కడో ఒక చోట తన్నులాటలే..
ఎమ్మెల్యే వంశీ వైసీపీలో అనధికారికంగా చేరి ఆరు నెలలు అవుతోంది. ఆయన మంత్రి కొడాలి నాని సపోర్ట్ తో జగన్ ను కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం టీడీపీ, చంద్రబాబు, లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మెప్పు పొందేందుకు ఆయన చేసిన ప్రయత్నాలే ఇవన్నీ. అయితే.. జగన్ కు ఆయన చేసిన అతి భజన ఇప్పుడు బెడిసి కొట్టినట్టే ఉంది. గన్నవరంలో ఒంటిచేత్తో పెత్తనం నడిపించాలని అనుకున్న వంశీకి జగన్ ఆ అవకాశం ఇవ్వలేదు. పార్టీకి ముందునుంచీ నమ్ముకుని ఉన్న గుత్తా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పని చేయాలని ముందే స్పష్టం చేశారు. అయితే అక్కడ ఇలా జరగడం లేదు. మూడు వర్గాలు రోజూ కొట్టుకుంటూ ఎవరి దారిన వారు వెళ్తున్నారు.
రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం..
గడచిన మూడు నెలల నుంచి గన్నవరంలో వంశీ వర్సెస్ గుత్తా, వంశీ వర్సెస్ యార్లగడ్డ వర్గం.. కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్తున్నారు. వంశీపై వీరిద్దరూ మీడియా ముఖంగానే విమర్శలు చేస్తున్నారు. దీంతో వంశీ అక్కడ ఇమడలేక రాజకీయాల నుంచి తప్పుకునే యోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నారు. నిజానికి గతంలో కూడా వంశీపై ఇవే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ వివాదాలను చూపించి రాజకీయాల నుంచి వంశీ తప్పుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. నిజానికి యాక్టివ్ పాలిటిక్స్ లో కీలకంగా ఉన్న వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవడం అసాధ్యం. కేవలం రాజకీయ సానుభూతి కోసమే వంశీ వర్గం ఈ ప్రచారానికి తెర లేపిందని అంటున్నారు.