అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో టిడిపికి 40సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు యాంటెన్నాకు పోలింగ్ రోజే సిగ్నల్స్ అందాయనీ, అయినా చంద్రబాబు 130,150అని బడాయికి పోతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. బుధవారం వరుస ట్వీట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. ఈవిఎంలపై దేశ వ్యాప్త ఉద్యమం బెడిసికొట్టిందో ఎమో వైసిపి హెలికాప్టర్లతో డబ్బులు వెదజల్లిందన్నట్లు చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారని విజయసాయి రెడ్డి అన్నారు.
గుంటనక్కలు ఇకపై శాకాహారమే తింటామని శపథం చేసినట్టే ఉంది చంద్రబాబు, ఆయన పార్టీ పెద్దల వ్యవహారం అని విజయసాయి విమర్శించారు. ఎన్నికల వ్యవస్థను నాశనం పట్టించిన వ్యక్తులు ఓటర్లు తెలివిమీరారని దుయ్యబడుతున్నారనీ, మద్యం ఏరులై పారించింది మీరు కాగా అంటూ బ్యాంకుల నుండి రెండువేల నోట్లు మాయం చేసింది ఎవరని ప్రశ్నించారు.
వైసిపి డబ్బు పంపిణీలో సక్సెస్ అయిందని ఆయన కుల మీడియా చెత్త రాతలు మొదలు పెట్టిందనీ, డబ్బు పంచలేక బాబు ఓడిపోతున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుందని విజయసాయ అన్నారు. అసలు డబ్బులు వెదజల్లే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే మీ జాతి రత్నం అంటూ విమర్శ చేశారు.
పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి బతిమాలి మరీ ఆహ్వానాలు తెప్పించుకుంటున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు.
‘2014 -19 వరకూ సిఎంగా ఉండటం మీ జీవితంలో బోనస్ పీరియడ్ అనుకోవాలి, బిజెపి మద్దతు వల్ల 15శాతం ఓట్లు అప్పనంగా పడి మ్యాజిక్ ఫిగర్ దాటావు, ఇప్పుడు పాల్, పార్టనర్ ఏరుదాటిస్తారని అనుకున్నావు కానీ అంచనా తప్పింది, మ్యానిప్యులేషన్లు అన్ని వేళలా పని చేయవు కదా?’ అని విజయసాయి రెడ్డి విమర్శిస్తూ ట్వీట్లు పోస్టు చేశారు.