ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు? టీడీపీ-జనసేన కూటమికి విజయం అందించాలని ప్రజలు డిసైడ్ అయ్యారా? పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మరో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానం ఇస్తూ తాజాగా సంచలన సర్వే విడుదలైంది. ఏపీ ఓటర్ల నాడికి అద్దం పట్టేలా ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ లేటెస్ట్ సర్వేను విడుదల చేసింది.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ-జనసేన కూటమి 104 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని సర్వే అంచనా వేసింది. అధికార వైసీపీ కేవలం 49 సీట్లకే పరిమితం కానుందని తేల్చింది. 22 నియోజకవర్గాల్లో నువ్వా-నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉంటుందని విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ-జనసేన కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే లెక్కగట్టింది. వైసీపీకి 7 స్థానాలు వస్తాయని పేర్కొంది.
టీడీపీ-జనసేన కూటమికి ఓటింగ్ షేర్ భారీగా పెరగడం ఖాయమని ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ తాజా సర్వే పేర్కొంది. ఈ కూటమికి 51.4 శాతం ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఇక వైసీపీకి 42.6 శాతం ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటోందని, ఓటింగ్ షేర్ 3 శాతం పెరిగిందని వెల్లడించింది. ఇక బీజేపీకి 1.3 శాతం, ఇతరులకు 1.4 శాతం ఓట్లు పడతాయని పేర్కొంది. ఇతర పార్టీల జాబితాలో సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, బీసీవై, జై భారత్ పార్టీ వంటి పార్టీలు ఉన్నాయని తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 – 29 మధ్య కాలంలో ఈ సర్వేను చేపట్టినట్టు ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్’ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టామని, 53,000 మంది అభిప్రాయాలను సేకరించినట్టు వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఉన్నారని వివరించింది. వీరు ఏ పార్టీకీ చెందిన వారు కాదని, సాధారణ ప్రజలేనని పేర్కొంది. అంతేకాదు.. ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేస్తున్నట్టు వారు తెలిపారని సర్వే సంస్త వెల్లడించడం గమనార్హం.