YS Jagan: జగన్ కి మొదటి నుండి రిస్కులు కొత్త కాదు.. 2009లో దివంగత రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుండి నేటి వరకు జగన్ పాత్రలు, ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు మారాయేమో కానీ.., రిస్క్ మాత్రం మారలేదు.. తగ్గలేదు..! నాడు కాంగ్రెస్ నుండి బయటకు రావడం మొదలుకుని.., 2014 – 19 మధ్య ప్రతిపక్ష నేతగా.. 2019 తర్వాత సీఎం అయిన తర్వాత కూడా అనేక రిస్కులు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. కానీ నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం రిస్కులు చేయడం వేరు.. అవి తిరగదోడితే పెద్దగా ప్రభావం ఉండదు.., కానీ సీఎంగా ఉన్నప్పుడు రిస్కులు చేస్తేనే అవి తనకు, పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా ఎంతో కొంత మేలు లేదా కీడు చేస్తాయి.. ప్రస్తుతం జగన్ అదే దశలో ఉన్నారు..!
సో.. సీఎం జగన్ ప్రస్తుతం రెండు రకాల పరీక్షలు ఎదుర్కోబోతున్నారు… రెండు రకాల రిస్కులు చేయబోతున్నారు.. ఆయన రాజకీయ భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ రెండిట్లో ఒకటి పార్టీ పరమైన నిర్ణయం, రెండవది ప్రభుత్వపరమైన నిర్ణయం. పార్టీ అధినేత జగనే. ప్రభుత్వ అధినేతా జగనే. రెండిటికీ ఆయనే అధినేతగా ఉన్నారు కాబట్టి ఈ రెండు నిర్ణయాలను ఆయన ఎంత జాగ్రత్తగా, ఎంత చాకచక్యంగా తీసుకుంటారో దాన్ని బట్టి ప్రజల్లోనూ, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన పట్టు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఈ రెండు జగన్మోహనరెడ్డికి ఎందుకు ప్రాముఖ్యత..ఎందుకు అవి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.. అవి ఈ రెండు మూడు నెలల్లోనే ఎందుకు రాబోతున్నాయి.. అనేది పరిశీలిస్తే..
YS Jagan: రాజధాని వికేంద్రీకరణలో ఎన్నో లోతులు..!?
ఇందులో మొదటిది రాజధాని వికేంద్రీకరణ అంశం. రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి 2019 నవంబర్ లోనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సీఆర్డీఏ రద్దు చేసింది. వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చింది. అయితే దానికి చట్టబద్ధత లేదనీ, శాసనమండలిలో ఆమోదించబడలేదని, చాలా వ్యతిరేకత ఉందని వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయని తెలుసుకుని 50 రోజుల క్రితం వాటిని విత్ డ్రా చేసుకుంది. మళ్లీ చట్టబద్దంగా మెరుగైన బిల్లు తీసుకువస్తామని ప్రభుత్వం చెప్పింది. సీఎం జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఆ తరువాత పెద్దగా మూడు రాజధానుల ప్రస్తావన లేదు. కాకపోతే మూడు రాజధానులను తెచ్చే అవకాశం ఉంది, దానికి పరిశీలిస్తున్నారు. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో వికేంద్రీకరణ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ లోగా సంక్రాంతి తరువాత అంటే జనవరి చివరి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకూ ప్రజాభిప్రాయ సేకరణ, స్థానిక సంస్థల నుండి తీర్మానాలు (గ్రామం పంచాయతీలు, మండల పరిషత్, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ ల నుండి) తీసుకోనున్నది ప్రభుత్వం. స్థానిక సంస్థల ఆమోదాలను కోర్టుకు చూపించి చట్టబద్దంగా చేశాము అని చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ స్థానిక సంస్థలు వైసీపీ ఆధీనంలో ఉండటం వల్ల వాళ్లకు ఎలా కావాలంటే అలా తీర్మానం చేసుకునే వీలు ఉంటుంది. రాజధాని వికేంద్రీకరణ కు కట్టుబడి ఉన్నారు. చేసేస్తారు.
మంత్రి వర్గ ప్రక్షాళన కూడా..!!
మరొక అంశం మంత్రి వర్గ ప్రక్షాళన. ఇది పార్టీ పరమైన నిర్ణయం. ఇది కూడా జగన్మోహనరెడ్డికి ఎందుకు కీలకం అంటే.. ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో ఎవరిని తీసేయాలి..కొత్త వాళ్లను ఎవరిని తీసుకోవాలి..అనేది పెద్ద పరీక్షే. రాష్ట్రంలో వైసీపీ పరిపాలన, అంతర్గత వ్యవహారాల కారణంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మందికి అసంతృప్తి, అసమ్మతి ఉంది. ఇందులో సీనియర్ లు ఉన్నారు. జూనియర్ లు ఉన్నారు. మరో పక్క వీరిలో కొందరిపై ఆయా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలకు అసంతృప్తి, అసమ్మతి ఉంది. ఇప్పుడు మంత్రి వర్గ ప్రక్షాళన అనేది సున్నితమైన అంశం. మంత్రిపదవులు ఆశిస్తున్న వాళ్లు 70 మంది ఉన్నారు. మంత్రిపదవులు మాత్రం 20 లేదా 22 ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఆర్కే రోజా ఇలా ప్రతి సామాజికవర్గం నుండి అరడజను నుండి డజనుకు పైగా నేతలు మంత్రిపదవులను ఆశిస్తున్నారు. వైసీపీకి మొదటి నుండి అండగా సామాజికవర్గాల నుండి పోటీ విపరీతంగా ఉంది. ఒక్క చిత్తూరు జిల్లాను ఉదాహరణకు తీసుకుంటే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కె రోజా ఇలా ముగ్గురు ఉన్నారు. ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వాళ్లు. వీళ్లల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వగలరు. ఒక్కళ్లకు ఇవ్వాలన్నా అక్కడ పెద్దిరెడ్డిని తప్పించాలి. ఆయనను తప్పించే అవకాశం లేదు. ఆయన సీనియర్ మంత్రి. ఇలా అన్ని జిల్లాల్లోనూ, అన్ని వర్గాల్లోనే ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జగన్మోహనరెడ్డికి ఇది చాలా సున్నితమైన అంశం. అందుకే మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో సానుకూలంగా అంత పాజిటివ్ గా జగన్ వెళ్లలేకపోతున్నారు. మంత్రి పదవులు ఆశించి రాని వాళ్లు బయట పడవచ్చు, ప్రభుత్వానికి తిరుగుబాటు చేయవచ్చు. వీళ్లు పార్టీకి వ్యతిరేకంగానూ మారవచ్చు. ప్రాంతీయ పార్టీలో ఇటువంటివి సహజమే. మంత్రివర్గ ప్రక్షాళన, రాజధాని వికేంద్రీకరణ బిల్లు తేవడం ఈ రెండు నెలల్లో జగన్మోహనరెడ్డికి కీలకం కాబోతున్నాయి..!