కాలంతో పాటు టెక్నాలజీలో వచ్చిన మార్పుల నేపథ్యంలో చాలా చౌక ధరలోనే స్మార్ట్ ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో యావత్ ప్రపంచం అరచేతిలోకి చేరింది. ఈ తరుణంలోనే పెద్ద సంఖ్యలో నెటిజన్లు తమ ఆలోచనలను, తమకు సంబంధించిన విషయాలను పంచుకోవడం కోసం సోషల్ మీడియాలో భాగమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే నేరాగాళ్లు సైతం టెక్నాలజీతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలు చాలానే చోటుచేసున్నాయి. పోలీసులు సైతం ఫేస్ బుక్ వాడే వారితో పాటు అన్లైన్ కొనుగోలుకు సంబంధించిన సైట్ల తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ.. సామాజిక మధ్యమాల పరిచయాలతో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజాగా ఇదే తరహాలో ఫేస్ బుక్ లో పరిచయమైన ఓ వ్యక్తి.. ఓ మహిళ దగ్గర నుంచి రూ. 17 లక్షలు ఎగరేసుకుపోవడంతో ప్రస్తుతం ఆమె లబోదిబో మంటున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగర పరిధిలోని బోయిన్పల్లికి చెందిన 67 ఏళ్ల ఓ ఉపాధ్యాయురాలు.. ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఈ తరుణంలోనే ఆమె ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటోంది. ఈ క్రమంలోనే గుర్తుతెలియని ఓ వ్యక్తి నుంచి ఫ్రెండ్ రెక్వెస్ట్ వచ్చింది.
అందులో తనను లండన్ నగరానికి చెందిన మెటర్నరీ డాక్టర్ పాల్గా పరిచయం చేసుకున్నాడు. ఈ ఉపాధ్యాయురాలు అతగాడితో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. వాట్సాప్ నెంబర్లను సైతం షేర్ చేసుకున్నారు. ఇలా ప్రతిరోజు తరచుగా చాటింగ్ చేశారు. ఇలా ఉండగా ఒకరోజు తమ స్నేహానికి గుర్తుగా ఓ బహుమతి పంపుతానని పాల్ మెసెజ్ చేశాడు. దీనికి ఎంతగానో సంబరపడిపోయిన సదరు టీచర్.. కానుక కోసం ఎదురుచూస్తుండగానే.. ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. “తాము ఢిల్లీ విమానశ్రయం నుంచి మాట్లాడుతున్నాం. మీకు లండన్ నుంచి ఖరీదైన పలు వస్తువులు వచ్చాయి. దీనికి ప్రాసెసింగ్ ఫీజు 35 వేలు చెల్లించండి. మీకు ఆ వస్తువులు పంపిస్తాం” అని పలు వివరాలు చెప్పి కాల్ కట్ అయింది.
ఈ క్రమంలోనే సదరు మహిళ వారం రోజుల్లోనే వారు చెప్పినట్టుగా 17 లక్షల వరకూ చెల్లించింది. ఇంకా ఆరున్నర లక్షలు కట్టకుంటే చట్టపరంగా చర్యలు తప్పవంటూ.. సాకేత్ కోర్టు పేరుతో నకిలీ నోటీసులు పంపారు. దీనికి సైతం నగదు చెల్లించడానికి రెడీ కాగా, కోర్టు విషయమని ఒకసారి పోలీసులను సంప్రదిస్తే మంచిదని స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్కు వేళ్లగా.. తనకు జరిగిన మోసం తెలుసుకుని లబోదిబో మంటున్నది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.