బీఆర్ఎస్ నాయకురాలు, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేయగా, మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో శ్రావణితో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జి వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం చేరికలను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా నేతలకు సూచించిన మరుసటి రోజే మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు పలువురు నేతల చేరికకు చర్యలు తీసుకోవడం విశేషం.
బీజేపీలో చేరిన అనంతరం శ్రావణి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తనను అణిచివేశారని, తన ఎదుగుదలను ఓర్వలేకపోయారని ఆరోపించారు. కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చినా తనను బీఆర్ఎస్ అధిష్టానం ఓదార్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానంతోనే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చానని తెలిపారు. బీజేపీ అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అయితే శ్రావణి చేరిక కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హజరు కాలేదు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో వారు ఉండటం వల్ల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బోగ శ్రావణి నెల రోజుల క్రితం జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యే సంజయ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. బీసీ నాయకురాలినైన తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నా అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు వెళ్లానని శ్రావణి అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినా బీఆర్ఎస్ అధిష్టానం స్పందించకపోవడం, పార్టీ నేతలు ఎవరూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయడం గానీ, మద్దతుగా నిలవడం గానీ చేయకపోవడంతో పార్టీ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు.
గంజాయి కేసులో వైసీపీ రెబల్ నేత సుబ్బారావు.. బుక్ అయినట్లేనా..?