Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ సర్కార్ కు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. రైతు బంధు పథకం నిధుల పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది ఈసీ. రైతు బంధు నిధులు జమ చేయడానికి ఇచ్చిన అనుమతిని కేంద్రం ఎన్నికల సంఘం వెనక్కు తీసుకుంది. నాలుగు రోజుల క్రితం రైతు బంధు పథకం కింద నిధులు విడుదల చేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. పాత పథకం కావడంతో నిధులు విడుదల చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంది.
అయితే వరుసగా సెలవులు రావడంతో ఈ రోజు, రేపు (సోమ, మంగళవారం) రైతు బంధు నిధులను విడుదల చేయాలని ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు రైతు బంధు ఇస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్న పిర్యాదు మేరకు ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. నిధులు విడుదల చేయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి మూడు లేఖలు రాసింది. రైతు రుణ మాఫీ, ఉద్యోగులకు మూడు డీఏల విడుదల, రైతు బంధు పథకం నిధులు విడుదలకు అనుమతి కోరుతూ ఈ లేఖలు రాశారు. అయితే రుణమాఫీ అమలు, ఉద్యోగులకు డిఏ లు విడుదల చేసేందుకు ఈసీ అనుమతించలేదు. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రైతు బంధు నిధులు విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసుకోవచ్చని తెలిపింది ఈసీ.
దీనిపై అభ్యంతరాలు రావడంతో తాజాగా రైతు బంధు విషయంలోనూ ఈసీ అనుమతులను వెనక్కు తీసుకుంది. మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల ఫలితంగానే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. డిసెంబర్ లో పంపిణీ చేయాల్సిన రైతు బంధు నిధులను ఎన్నికలకు ముందు విడుదల చేయడం ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడమే అవుతుందని విపక్షాలు పేర్కొంటున్నాయి.
PM Modi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన మంత్రి మోడీ