BRS Deeksha Diwas: తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల స్క్వాడ్ టీమ్ చేరుకుని కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరింది. ఎలక్షన్ కోడ్, 144 సెక్షన్ ఉన్న కారణంగా ఈసీ అనుమతి లేకుండా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి వీలులేదని తెలిపింది.
దీంతో ఇది కొత్త కార్యక్రమం కాదనీ, ఎప్పటి నుండో జరుపుతున్నామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నవంబర్ 29న కేసిఆర్ సచ్చుడో .. తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఇచ్చారని, అందుకే ఆ రోజున దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు కార్యక్రమం జరుపుతున్నారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ తెలిపింది. బీఆర్ఎస్ నేతలు సీపీతోనూ మాట్లాడారు. అయితే ఈ కార్యక్రమాన్ని భవన్ లోపలే జరుపుకోవాలని అధికారులు సూచించారు.
పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నట్లుగా తెలుస్తొంది. కేటిఆర్ సహా పలువురు నేతలు, కార్యకర్తలు దీక్షా దివస్ సందర్భంగా రక్తదానం చేశారు. కాగా తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి పిర్యాదు చేసింది. ఇమెయిల్ ద్వారా కాంగ్రెస్ పంపిన ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో వేచి చూడాలి.