Huzurabad By Poll: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజారాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అయితే ఈ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల కాకమునుపే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ప్రచార పర్వంలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ లు దూకుడు మీద ఉన్నాయి. టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.
Read More: Peddireddy: ఈటల ఎఫెక్ట్.. బీజేపీకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా
దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఈటలను గట్టిగా దెబ్బకొట్టాలని సీఎం కేసిఆర్ తన దైన రాజకీయ చతురతతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణను, ఆ తరువాత హుజారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో ఆహ్వానించి వారికి పార్టీ కండువాలు కప్పేశారు. ఇప్పుడు తాజాగా బీజేపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కేసిఆర్ ఆహ్వానంతో పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. రేపో మాపో పెద్దిరెడ్డి కేసిఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పుడే అసలైన వ్యవహారం మొదలైంది.
టిఆర్ఎస్ పార్టీ నుండి ప్రకటన వెలువడక ముందే హుజూరాబాద్ పార్టీ అభ్యర్ధిని తానే నంటూ కౌశిక్ రెడ్డి ఇప్పటికే అనుచరవర్గంతో చెప్పుకొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై కౌశిక్ రెడ్డి గంపెడాశతో ఉన్నారు. అయితే ఇప్పుడు మాజీ మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి టీఆర్ఎన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో కౌశిక్ రెడ్డి వర్గీయుల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఈటల కంటే ముందే పెద్దిరెడ్డి రెండు పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. అసెంబ్లీలో కేసిఆర్ కు పెద్దిరెడ్డి సహచరుడు కూడా. ఎల్ రమణ కూడా కేసిఆర్ కు పూర్వశ్రమంలో సహచరుడే. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ టికెట్ కేటాయింపు విషయంలో కేసిఆర్ మనసులో ఏముందో, ఈటలకు ధీటైన నేతగా ఎవరిని బరిలోకి దింపనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.