Huzurabad Bypoll: హూజూరాబాద్ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్ధిగా వెంకట్ బల్మూరు లు రంగంలో ఉన్న సంగతి తెలిసిందే. మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ (ఈటల) మధ్యనే జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ తదితర నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మద్దతుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో సహా ఆ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు గా ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
Huzurabad Bypoll: మంత్రి గంగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ
అయితే ఈ ఎన్నికల హడావుడిలో పని నేతలు కరోనా నిబంధనలు పాటించడం లేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారాలను నిర్వహించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నా నాయకులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఒక పక్క కరోనా తగ్గుముఖం పట్టిందని, మరో పక్క వ్యాక్సిన్ వేయించుకున్నామన్న ధీమాతో నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల అధికారులు వీరిని హెచ్చరిస్తున్నట్లు లేదు. దీంతో నాయకులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని వెల్లడించారు. రెండు రోజులుగా జ్వరం, జలుబు లక్షణాలు కనబడటంతో ఆయన కోవిడ్ పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్న గంగుల.. కొద్ది రోజులుగా తనతో కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలనీ, సెల్ఫ్ ఐసోలేషన్ కావాలని సూచించారు.
కోవిడ్ నిబంధనలు పాటించని నేతలు, కార్యకర్తలు
ఈ ఫోటో ఒక సారి గమనించండి.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వకముందు మంత్రి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొన్న దృశ్యం. ప్రచార రథంపై ఉన్న వారు ఎవ్వరూ మస్క్ లు ధరించలేదు. మాస్క్ లు ఉన్న ఇద్దరూ సరిగా పెట్టుకోలేదు. మరొక ఫోటో.. టిఆర్ఎస్ లో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పుతున్న మంత్రి గంగుల కమలాకర్. అక్కడ పాల్గొన్న వారు ఎవ్వరూ మాస్కులు ధరించలేదు, భౌతిక దూరం పాటించలేదు. ఇదే పరిస్థితి బీజేపీ నేతల్లోనూ ఉంది.