KCR: సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఎప్పుడూ ఊహకందనివే. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాష్ట్రస్థాయి, జాతీయ రాజకీయాలు తెలిసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ఎన్నికై వచ్చే ఏడాది చివరికి మరోసారి ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారు. ఆపై.. ఆరు నెలలకు జాతీయస్థాయి ఎన్నికలను సిద్ధం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. నిజానికి గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావించారు. ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో చక్రం తిప్పాల్సిన అవసరం ఉందని ఇతర రాష్ట్రాల సీఎంలను కలిశారు. అప్పట్లో సాధ్యం కాకపోయినా.. ఇప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఈ అంశంపై ఇటివలే కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ లో ఆర్జేడీ సారధి తేజస్వి యాదవ్ తో సమావేశమయ్యారు. దీనికంటే ముందు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తన వాగ్భాణాలను ఎక్కుపెట్టారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చూపేందుకు ప్రయత్నించారు. కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దూరం చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. వామపక్ష నేతల్ని కలుపుకునేందుకు కేరళ సీఎం పినరయి విజయన్ తో సమావేశం అయ్యారు. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనేది ఆయన ఆలోచనగా చెప్పాలి. గత ఎన్నికలకు ముందే బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఒడిశా సీఎంతోనూ (KCR) కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి.
అయితే.. బీజేపీపై (KCR) కేసీఆర్ ఎంత ఫైర్ అవుతున్నా.. జాతీయ మీడియాలో అనుకున్నంత కవరేజీ రావడం లేదని తెలుస్తోంది. నేషనల్ చానెల్స్ లో ఫోకస్ అయితేనే బీజేపీకి వ్యతిరేకత చూపగలరు. ఉత్తరాదిలో బీజేపీకి ఉన్న పాజిటివిటీ అలాంటిది. అందుకే.. నిన్నటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. ప్రత్యేకించి నేషనల్ మీడియాకు ఆహ్వానం ఇచ్చారట కూడా. కానీ.. జరగలేదు. అదే జరిగితే.. ప్రస్తుత కోవిడ్ సమస్యలు కాకుండా జాతీయ రాజకీయాల పైనే ప్రశ్నలు వస్తాయని క్యాన్సిల్ చేసుకున్నారని అంటున్నారు. పరిస్థితులను నిశితంగా గమనించాకే ఈ అంశాలపై మాట్లాడాలనేది ఆయన ఆలోచనగా చెప్పాలి.