Rahul Gandhi: కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయూత పేరుతో వృద్ధులకు, వితంతువులకు రూ.4వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. పోడు భూములన్నీ గిరిజనులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణ కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. దేశాన్ని ఏకం చేసేందుకే జోడో యాత్ర చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో విద్వేషం తొలగించే ప్రయత్నం చేశాననీ, అది కాంగ్రెస్ పార్టీ సిద్దాంతమన్నారు. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్ధించిందన్నారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. పొంగులేటి పులిలా పోరాడుతున్నారని కితాబు ఇచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఖిల్లా అని ఇక్కడ మనుషుల్లో కాంగ్రెస్ రక్తం ఉందన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న భట్టి విక్రమార్కకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు.
ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఓ స్వప్తంగా ఉండేదనీ, తెలంగాణ పేదలు, రైతులు అందరికీ ఓ స్వప్తం అయితే తొమ్మిదేళ్ల పాటు ఆ కలను బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిఫ్తేదార్ పార్టీ (బీజేపీ బంధువుల పార్టీ) గా అభివర్ణించారు. సీఎం కేసిఆర్ తెలంగాణ రాజుగా భావిస్తున్నారనీ, ఈ రాష్ట్రం ఆయన జాగీరు అనుకుంటున్నారనీ అన్నారు. ధరణి తో భుములు ఎలా దోచుకుంటున్నారో భారత్ జోడో యాత్ర సందర్భంలో తనకు ప్రజలు చెప్పారన్నారు. మిషన్ భగీరథలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనీ, అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. సమాజంలోని అన్ని వర్గాలను కేసిఆర్ దోచుకున్నారన్నారు. పార్లమెంట్ లో బీజేపీకీ బీఆర్ఎస్ బీ టీమ్ గా పని చేసిందని విమర్శించారు.
రైతుల బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. కేసిఆర్ రిమోట్ ప్రధాని మోడీ చేతిలో ఉందని అన్నారు రాహుల్ గాంధీ. కర్ణాటకలో రైతులు, ఆదివాసీలు, పేదలు అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలిచారనీ, తెలంగాణలోనూ ఇదే జరగబోతున్నదని అన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందన్నారు. తొలుత ఇక్కడ ముక్కోణపు పోటీ అనుకున్నారనీ, కానీ బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించిన విధంగానే తెలంగాణలో బీజేపీ బీటీమ్ ను ఓడించబోతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఒప్పందం ఉండదని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ వస్తే తాము హజరు కాబోమని ముందుగానే చెప్పామన్నారు రాహుల్ గాంధీ. కేసిఆర్ అవినీతికి ప్రధాని మోడీ అండదండలే కారణమని అన్నారు. కేసిఆర్ ఏ స్కామ్ లు చేశారో కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మోడీకి తెలుసుననీ, అందుకే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ గా ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో వేయాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కేసిఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చారన్నారు. ఏ రాష్ట్రంలో జరగని విదంగా దాదాపు 8 వేల మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతుల రుణ మాఫీ, నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేననీ, అధికారంలోకి రాగానే డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా రైతులు, యువతకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. జనగర్జన సభకు అడ్డంకులు సృష్టించేందుకు వారం రోజులుగా బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హజరైయ్యారు.