Rahul Gandhi: పదేళ్లు దోచుకున్న పాలనకు అంతం పలికే రోజు వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ దోచుకుందన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ పినపాక, నర్సంపేట, వరంగల్లు ఈస్ట్ నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్ లలో మాట్లాడారు.
కాంగ్రెస్ తుఫానులో ఈ సారి బీఆర్ఎస్ కొట్టుకుపోవడం తప్పదని అన్నారు రాహుల్ గాంధీ. కేసిఆర్ అవినీతిని ప్రజలు అర్ధం చేసుకున్నారన్నారు. మీరు చదివిన పాఠశాల, వేసిన రోడ్డు కూడా కాంగ్రెస్ హయాంలో వేసిందేనని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసిఆర్ ప్రభుత్వంలో దోచుకున్న సొమ్మంతా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలకు పంచుతామని తెలిపారు. వారు దాచుకున్న సొమ్మంతా పేదల అకౌంట్ లోకి వేస్తామని హామీ ఇచ్చారు.
రైతులు, ప్రజలను కేసిఆర్ వంచించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే గ్యారెంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేలా కాంగ్రెస్ పాలన ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని, కాంగ్రెస్ ను ఓడించేందుకు మూడు పార్టీలు ఒక్కటయ్యాయని మరో సారి విమర్శించారు. తెలంగాణ పర్యటన ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ .. తెలంగాణలో కాంగ్రెస్ విజయం తథ్యమంటూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ విజయం ప్రజల తెలంగాణతో స్వర్ణ యుగానికి నాంది పలుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ కు ప్రజా పాలన భవన్ గా పేరు మారుస్తామని పేర్కొన్నారు. ఆ భవనం తలుపులు 24 గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయని అన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను 72 గంటల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్ లు నిర్వహిస్తారని రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. జవాబుదారీ తనం, పారదర్శకత కోసం ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలంతా తమతో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
CM YS Jagan: ‘ప్రజాదీవెన ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోను’