CM Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవేళ ప్రారంభించారు. అసెంబ్లీ వద్ద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, యువతులు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు.
అలానే రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచే మరో పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్ లను ఆవిష్కరించారు. అలానే తెలంగాణ ప్రభుత్వం తరపున బాక్సర్ నిఖత్ జరీన్ కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతి కుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. ఇవాళ తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారన్నారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారెంటీలను ఇచ్చారన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇవేళ రెండు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని అన్నారు.
మహిళలు ఈ రోజు నుండి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. అనంతరం అసెంబ్లీ నుండి కాంగ్రెస్ మంత్రులు, మహిళా నేతలు బస్సులో ట్యాంక్ బండ్ కు బయలుదేరారు. దీంతో అక్కడ సందడి వాతావరణం చొటుచేసుకుంది.
BRS: ఎమ్మెల్సీ పదవులకు ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతలు రాజీనామా