Supreme Court: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తెలిపింది. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ఇవేళ విచారణ కు రాగా, స్కిల్ స్కామ్ క్వాష్ పిటిషన్ లోని కొన్ని అంశాలు ఫైబర్ నెట్ కేసుతో ముడిపడి ఉన్నాయనీ, కావున క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది.
ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకూ సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు ఉన్న నేపథ్యంలో 20న తిరిగి సుప్రీం కోర్టు పునః ప్రారంభం అవుతుంది. ఫైబర్ గ్రిడ్ కేసును తొలుత ఈ నెల 23వ తేదీకి ధర్మాసనం వాయిదా వేయగా, తన కుమారుడి వివాహం కారణంగా వేరే తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో నవంబర్ 30కి వాయిదా సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పై ఉన్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు.
సుప్రీం కోర్టులో కేసు ముగిసే వరకూ అరెస్టు చేయబోమన్న నిబంధన కొనసాగించాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 30వ తేదీ వరకూ చంద్రబాబును అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. మరో వైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
Revanth Reddy: కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే ఐటీ దాడులు దేనికి సంకేతమని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి