CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి బేగంపేటలో ఉన్న ప్రగతి భవన్ సీఎం అధికార నివాసంగా ఉంది. రెండు టర్మ్ లుగా కేసిఆర్ ప్రగతి భవన్ కేంద్రంగానే పరిపాలన సాగించారు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రగతి భవన్ ను జ్యోతిరావుపూలే ప్రజా భవనంగా మార్చేశారు. ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తొలగించేశారు. రాష్ట్రంలోని ప్రజలు ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్రజా భవన్ కు రావచ్చని..ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రజా భవన్ లో ప్రతి శుక్రవారం ప్రజా దర్భార్ నిర్వహిస్తామని, ప్రజల నుండి సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ సీఎం అధికారిక నివాసంగా ఉన్న ఈ భవనాన్ని ప్రజా భవన్ గా మార్చడంతో సీఎం రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కోసం అధికార యంత్రాంగం పరిశీలన ప్రారంభించింది. ఈ క్రమంలో జూబ్లిహిల్స్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఆర్డీ) ప్రాంగణంలో గట్టు మీద ఉన్న బ్లాక్ అనువుగా ఉంటుందని భావించారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లిహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లో ఉండటంతో క్యాంపు కార్యాలయానికి అక్కడికి దగ్గరలోనే ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణం అనువుగా ఉంటుందని అనుకుంటున్నారు. దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణంలో ఒకే సారి 150 మంది చొప్పున కూర్చునే నాలుగు కాన్ఫరెన్స్ హాళ్లు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డు రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిధులకు ఆశ్రయం ఇవ్వడానికి మంజీర, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం హెచ్ఆర్డీకి స్వయంగా వెళ్లి పరిశీలించారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.