టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు సాగిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు వలపన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్) ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సీబీఐ ద్వారా గానీ లేక ప్రత్యేక దర్యాప్తు సంస్థతో పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్ అభ్యర్ధనను తోసిపుచ్చింది. సిట్ అధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని దర్మాసనం ఆదేశించింది. సిట్ దర్యాప్తును జస్టిస్ విజయసేన్ రెడ్డి పర్యవేణిస్తారని తెలిపింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను మీడియాకు, రాజకీయ నాయకులకు వెల్లడించేందుకు వీల్లేదని చెప్పింది. కేసు దర్యాప్తుపై పురోగతిని ఈ నెల 29వ తేదీన సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.