Khairatabad Ganesh: హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 18 (రేపటి) నుండి ఈ నెల 28 వ తేదీ వరకూ 11 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి. గణేష్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు.
11 రోజుల పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో నిత్యం రద్దీ గా ఉంటాయి. దీంతో ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిసరాల్లో 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపటి నుండి నిమజ్జం అయ్యే వరకూ ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుండ అర్దరాత్రి వరకూ అమల్లో ఉంటాయని చెప్పారు.
రాజీవ్ గాంధీ విగ్రహం నుండి మింట్ కాంపౌండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్ కు అనుమతి లేదనీ, అటు వైపు వెళ్లే వాహనాలు అన్నీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు అటు రాజ్ దూత్ లే నుండి బడా గణేష్ వైపు రోడ్డులో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు ట్రాఫిక్ ని మళ్లించారు. మింట్ కాంపౌండ్ నుండి ఐమాక్స్ థియేటర్ వైపు సాధారణ ట్రాఫిక్ అనుమతి లేదనీ, అటుగా వెళ్లే వాహనాలు మింట్ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు మళ్లించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించాలని పోలీసులు సూచించారు.
కాగా ఖైరతాబాద్ గణేషుడి వద్ద సందడి మొదలైంది. చవితి ఒక రోజు ముందే ఖైరదాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ ఏడాది శ్రీదశ మహా విద్యాగణపతిగా భక్తులకు స్వామి వారు దర్శనమిస్తున్నారు. 11 రోజుల పాటు ఘనంగా జరిగే ఉత్సవాల్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు తొలి పూజ ప్రారంభం కానుంది. 11 గంటలకు ఖైరతాబాద్ గణేషుడిని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దర్శించుకోనున్నారు. గణేషుడి మండప పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
AP CID: ‘స్కిల్ స్కామ్ లో ప్రధాన కుట్రదారుడు చంద్రబాబే’