YS Sharmila: ఏపి, తెలంగాణ నీటి వివాదంపై టీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరగుతున్న సంగతి తెలిసిందే. ఏఏపి ప్రభుత్వం నిర్వించనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి, ఎన్జీటీకి ఫిర్యాదు చేయడం, పనులు నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు రావడం జరిగింది. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ మంత్రులు ఈ నీటి వివాదాన్ని పురస్కరించుకుని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా, ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ నేతల విమర్శలకు ఏపి మంత్రులు కౌంటర్ విమర్శలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ వ్యవహారం విమర్శలు, ప్రతి విమర్శలతో పరిష్కారం అయ్యేది కాదని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలుసు. కానీ వారు మౌనంగా ఉన్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాజన్నరాజ్యం తెస్తానని పార్టీ ప్రకటన చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ఈ వివాదంపై ఆంధ్రా పక్షమా, తెలంగాణ పక్షమా అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ట్విట్టర్ వేదికగా నేడు స్పందించారు.
“తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం. అందుకు అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా మేము సిద్ధం” అని షర్మిల ట్వీట్ చేస్తూ గతంలో మాట్లాడిన వీడియోను జత చేశారు. తెలంగాణ కు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, పనినైనా అడ్డుకుంటానని ఆమె గతంలో స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పేరు ప్రస్తావించకుండానే తన సోదరుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనూ పోరాడతానని పరోక్షంగా నాడు పేర్కొన్నారు షర్మిల.
అయితే రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఏర్పడితే సామరస్య పూర్వకంగా చర్చలు జరిపితే పరిష్కారం అవుతాయి కానీ పోరాడితే, కోట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదో క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడానికి పక్క రాష్ట్రంతో పోరాడతా, కొట్లాడతా అని మాట్లాడితే ఈలలు వేస్తూ చప్పట్లు కొడతారు కానీ సమస్య పరిష్కారానికి ఇది మార్గం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. రానురాను ఈ నీటి పంచాయతీ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.
https://twitter.com/realyssharmila/status/1409465863057534978