YS Sharmila: మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పై మరో సారి ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మహబూబాబాద్ లో పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేసి షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ తనపైనే శంకర్ నాయక్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తీవ్ర పదజాలంతో తనను తిట్టారని అన్నారు. ఒక మహిళను ఎలాంటి మాటలైనా అంటారా అని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే వేల ఎకరాలు భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న అవినీతిని ఒక మహిళ ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా అని షర్మిల నిలదీశారు. ఈ సందర్భంలో షర్మిల శంకర్ నాయక్ ఆగడాలు ఇవి అంటూ వీడియో క్లిప్ లను ప్రదర్శించారు.
మహబూబాబాద్ లో 2014 లో 2,170 ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే ఈ రోజు వరకూ 2,100 ఎకరాలను కబ్జా చేశారనీ, ఈ నియోజకవర్గంలో అసలు ప్రభుత్వ భూమూలే లేవట అనీ, చెరువులు, గిరిజన భూములు కబ్జా చేశారని కొంత మంది చెబుతున్నారన్నారు. తమ దగ్గరికి ఎన్నో ఫిర్యాదులు వస్తే వాటన్నింటికీ ఆధారాలు జత పరిచి వివరించామన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న కబ్జాల విషయం ఆ నియోజకవర్గంలో తెలియని వారు లేరని అన్నారు. జర్నలిస్ట్ లకు ప్లాట్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. శంకర్ నాయక్ అవినీతి పరుడు కాబట్టే ఆయన గురించి మాట్లాడామనీ, తనపై చేసిన వ్యాఖ్యలకు బదులు ఇచ్చానని తెలిపారు షర్మిల.
వలస వాదులు వచ్చి పార్టీలు పెడుతున్నారంటూ పరుష పదజాలంతో తనను ఆయన దూషించడం సమంజసమేనా అని ప్రశ్నించారు షర్మిల. ఒక మహిళపై పాలకులు ఇంత నీచంగా మాట్లాడిస్తారా అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ప్రభుత్వం అణిచివేత ధోరణి తో వ్యవహరిస్తొందని ఆరోపించారు. వాళ్ల అవినీతిని ప్రశ్నించినందుకు తనపై శంకర్ నాయక్ దాడికి ప్లాన్ చేశారని అన్నారు. పాలకపక్షం కుట్రతోనే పాదయాత్రను అడ్డుకుందని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల.
నీచ రాజకీయాలు అంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్