Children’s Story: ఒక ఊరి లో ప్రతి ఏటా దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని, పూజలు చేసి, ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి, మూగ్గులతో, తోరణాలతో, పువ్వులతో, చాలా అందంగా అలంకరించే వారు. ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి, పసుపు రాసి, బొట్లు పెట్టి, పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించే వారు.
మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాల్సిన అవసరం లేదు కదా. గ్రామంలో అన్నిటికన్నా ఆరోగ్య వంతంగా, బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునే వారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి, బొట్లు పెట్టి, గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసే వారు. ఆ ఎద్దును చాలా చూడ ముచ్చటగా తయారు చేసే వారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. రాముడు అనే ఒక ఎద్దును దేవుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు ఎంచుకున్నారు. బాగా తయారు చేసి, బండి కట్టారు. గుడి ముందర నుంచో పెట్టి, దేవుడి విగ్రహాన్ని బండిలో ఉంచి, హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు.
ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి, వంగి నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమ పడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా, కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయిటికి పెట్టి నడిచాడు. తనలో తానె మురిసిపోయి, పొంగిపోయాడు. ఇక సాయంత్రంతో మళ్ళి ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజా బజంత్రీలతో, గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలో నుండి దింపి లోపలి తీలుకుని వెళ్లారు. విగ్రహం బండిలోంచి దించగానే ఇంకేమి ఉంటుంది. అందరు రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు.
రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్ల పాకలో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరు దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్ధమయ్యింది. మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకు అని.ఏదైనా ఆఫీసుకు ప్రజలు వెళితే అక్కడ ఉన్న అధికారి చిన్న వయసు వాడైనా నమస్కారం పెడతారు. అంటే వారు గౌరవించేది ఆ వ్యక్తికి కాదు. ఆయనకు ఉన్న హోదా. ఆ విషయాన్ని ఏ స్థాయిలో పని చేస్తున్న అధికారులు అయినా గుర్తెరగాలి.
కథలు.వర్డ్ ప్రెస్.కామ్ సౌజన్యంతో…