(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపి, తెలంగాణల మధ్య అంతర్రాష్ట్ర ఆర్ టీ సీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. కరోనా నేపథ్యంలో ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సేవలు నేటి రాత్రి నుండి పునః ప్రారంభం కానున్నాయి. బస్సు సర్వీసుల పునరుద్ధరణకు ముందడుగు పడటంతో ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ఒప్పందం ప్రకారం ఏపిలో 1,61,258 కిలో మీటర్ల మేర 826 తెలంగాణ బస్సులు తిరగనున్నాయి. అదే విధంగా తెలంగాణలో 1,60,999 కిలో మీటర్ల మేర 638 ఏపి బస్సులు తిరగనున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దీంతో సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లో అవగాహన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ఆర్ టీ సీ ఎండిలు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ కొంత సమయం తీసుకున్నప్పటికీ సమగ్రమైన అవగాహనతో ఒప్పందం కుదిరిందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ఏపిఎస్ ఆర్ టీ సీకి లాభమేనన్నారు. ఈ రోజు రాత్రి నుండే ఆర్ టి సీ బస్సులు రెండు రాష్ట్రాల మధ్య నడుస్తాయని చెప్పారు. బస్సులు నడపకపోవడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి రెవెన్యూ నష్టం 2వేల కోట్లు కాగా, ఏపిఎస్ ఆర్ టీ సీకి రూ.2400కోట్ల నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత నుండి కరోనా లాక్ డౌన్ ముందు వరకూ ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారమే బస్సులు నడిచాయనీ, కరోనా లాక్ డౌన్ మూలంగానే ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లేదనే విషయం తెలిసిందన్నారు.
ఏపిఎస్ ఆర్ టీసీ ఎండీ కృష్ణబాబు మాట్లాడుతూ త్వరలో అంతర్రాష్ట్ర టాక్స్ పేమెంట్ కోసం ఇరు రాష్ట్రాల మంత్రుల భేటీ ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకూ ఉమ్మడి రాష్ట్ర నిబంధనల ప్రకారం బస్సులు నడిపామనీ, ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఆర్ టి సీ బస్సులు నడుపుతున్నామని అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు లక్ష కిలో మీటర్లు నడపాలంటే కష్టమేనని అన్నారు. కరోనా పరిస్థితులు చక్కబడి సాధారణ స్థితికి రావడానికి మరో ఆరు నెలలు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సులను నడపాలని ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఒక వేళ లక్ష కిలో మీటర్లు ఇరు రాష్ట్రాలు తిప్పలేకపోతే మళ్లీ పునరాలోచన చేయాల్సి ఉంటుందని కృష్ణబాబు పేర్కొన్నారు. గూడ్స్ సర్వీసులపై త్వరలో మరో సారి చర్చలు జరుపుతామని తెలిపారు.
తెలంగాణ, ఏపి మధ్య కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి 22వ తేదీ నుండి బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. లాక్ డౌన్ అనంతరం ఆంతర్రాష్ట్ర రవాణా సర్వీసులకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కిలో మీటర్ల పంచాయతీతో మూడు నెలల నుండి బస్సు సర్వీసుల పునఃరుద్దరణ జరగలేదు.