(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. గుజరాత్లో చెలరేగిన అల్లర్లపై నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికను గుజరాత్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గోధ్రా రైలు దుర్ఘటన అనంతరం చెలరేగిన ఘర్షణలు వ్యవస్థీకృతంగా చేసినవి కాదని, వీటిని నియంత్రించడంలో పోలీసులు విఫలం అయ్యారని నానావతి కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. ఈ అల్లర్లతో అప్పటి రాష్ట్ర మంత్రులెవరికీ సంబంధం లేదని తేల్చి చెప్పింది.
వెయ్యి మందికి పైగా ముస్లింలు చనిపోయిన ఈ అల్లర్ల కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, ఆయన క్యాబినెట్లోని మంత్రులకు నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వార్త సంస్థ పేర్కొంది. రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ జీటీ నానావతి, అక్షయ్ మెహతాలు తమ నివేదికను 2014లో అప్పటి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్కు సమర్పించారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రదీప్సింగ్ జడేజా దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
2002 ఫిబ్రవరి 27వ తేదీన గోధ్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులోని రెండు బోగీలకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది ‘కరసేవకులు’ చనిపోయారు. దీంతో, మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. వీరిలో అత్యధికులు ముస్లింలు.