బిగ్ బాస్ నాలుగో సీజన్ నాలుగో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ చాలా జోరుగా సాగింది. గతవారం హౌస్ లో జరిగిన గొడవల వల్ల ఈసారి ఎలిమినేషన్ చాలా ఘాటుగా జరిగింది. మొత్తానికి ఒక మూడు పేర్లు మాత్రం రిస్క్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మెహబూబ్, సోహెల్, స్వాతి దీక్షిత్ ఈసారి తక్కువ ఓటింగ్ వచ్చిన జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. అభిజిత్ ఎప్పటిలాగే టాప్ లో కొనసాగుతుండగా, దేత్తడి హారిక కూడా మంచిగా ఓట్లు సంపాదించింది. కుమార్ సాయి ఫర్వాలేదనిపించే ఓట్లతో మిగతా ముగ్గురిని వెనక్కు నెట్టాడు.
అయితే వీరి ముగ్గురిలో ఈరోజు రక్షించబడింది ఎవరు? రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే విషయంపై ప్రేక్షకులకు ఉత్కంఠ నెలకొంది. ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున కొద్దిమంది పై ఫైర్ అవ్వడం ప్రోమోలో చూశాం. వారంతా ఏదో ఒక పని చేసి లేదా గేమ్ సరిగ్గా ఆడక నాగార్జున చేతిలో చివాట్లు తిన్నారు. అయితే వీరిలో ఏ కోవలో కూడా స్వాతి దీక్షిత్ కనిపించదు. ఆమె వచ్చిన రెండవ వారంలో కూడా ఇంటి సభ్యులతో సరిగా కలిసి పోలేక టాస్క్ లో యాక్టివ్ గా పాల్గొనలేక ప్రేక్షకులను నిరుత్సాహపరిచిందనే చెప్పాలి.
ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కూడా స్వాతి దీక్షిత్ అనే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొంతమంది మెహబూబ్ గత వారం తప్పించుకున్నాడు ఈసారి కచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు అని అంటున్నారు. పైగా సోహెల్ కూడా తన దుందుడుకు స్వభావంతో చాలా నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. అయితే వీరిద్దరిని కాదని స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ చేశారు అన్న వార్తల పై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఆమెకు కనీసం ఒక వారం సమయం బిగ్బాస్ ఇచ్చి ఉంటే బాగుండేదని అంటున్నారు. అయితే మొత్తానికి ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఇంకా ఖచ్చితం కాకపోయినా స్వాతి మాత్రం తన సూట్ కేస్ సర్దుకొని రెడీ గా ఉండాలని మాత్రం పలువురు సూచిస్తున్నారు.