ఢిల్లీ పర్యటన ఆకస్మిక రద్దు.., ఎస్ ఈసీపై కోర్టు తీర్పు.., తాజా రాజకీయ పరిణామాలు.., ఇలా అన్ని అంశాలు ఒకదానికొకటి తలనొప్పిగా మారుతుండడంతో సీఎం జగన్ వీటి పరిష్కారంపై దృష్టి పెట్టారు. అత్యవసరంగా అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నాయకులతో తన క్యాంప్ కార్యాలయంలో భేటి అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు… కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, కన్నబాబు సహా కీలక నేత విజయసాయిరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఢిల్లీ రద్దు అవ్వగానే పిలుపు…!
నిజానికి ఈ రోజు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అక్కడ హోమ్ మంత్రి అమిత్ షా, ఢిల్లీ పెద్దలతో భేటీ అవ్వాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దు అయింది. కారణాలు పైకి మాత్రం అమిత్ షా వేరే షెడ్యూల్ లు ఉన్నాయని చెప్తున్నప్పటికీ… అంతర్గతంగా మాత్రం కొన్ని కీలక వ్యవహారాలు నడిచినట్టు తెలుస్తుంది. అందుకే ఢిల్లీ టూర్ రద్దవ్వగానే మంత్రులు ఆయన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ నుండి మంత్రులకు, నేతలకు పిలుపు వచ్చింది. గంట నుండీ ఈ భేటీలో జరుగుతుండగా… తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు అయిన వ్యవహారంపై కూడా కీలక చర్చ జరిగినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం కొడాలి నాని లేదా విజయసాయి మీడియా మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.