ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం అందరిని విపరీతంగా ఆవహించింది. చనిపోయిన వారి అంత్యక్రియలు కూడా అడ్డుకుంటున్న కుసంస్కృతి ఈ వైరస్ ద్వారా దాపురించింది. ఇక అంటు వ్యాధితో చనిపోయిన వారిని గాలికి వదిలేసిన తీరు మరియు ఆ దారుణమైన పరిస్థితి తాజాగా ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. కుళ్ళిపోయిన మృతదేహాల స్థితి మనుషుల్లోని అమానవీయత తెలియజేస్తోంది.
కరోనా తో చనిపోయిన మృతులకు స్మశానంలో అంత్యక్రియలను అడ్డుకున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే మూడుసార్లు అధికారులు చనిపోయిన వారిని పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించడం ప్రజలు వారు అడ్డుకుంటున్నారు.
దీంతో ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలో తెలియక ఒంగోలు గవర్నమెంట్ ఆసుపత్రి లోనే మృతదేహాలను భద్రపరచాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఆ మృతదేహాలు కాస్తా కుళ్ళిపోయి దయనీయంగా తయారైపోయింది. ఒంగోలు నగరంలోని శ్మశాన వాటిక లో కరోనా మృతుల అంత్యక్రియలను జనం అడ్డుకున్నారు.
ఒంగోలు, కమ్మపాలెం స్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి అధికారులు రెడీ కాగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల సాయంతో మృతదేహాలను ఒంగోలులోని యరజర్ల శ్మశాన వాటికకు తరలించారు. అక్కడి వారు పోలీసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మళ్లీ మూడు మృతదేహాలను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు.
సీఎం జగన్ సైతం శ్రీకాకుళంలో అప్పట్లో ఇలానే జరిగిన ఘటనపై ప్రజలకు కనికరం చూపాలని విన్నవించారు. మనకూ ఇలాంటి పరిస్థితే వస్తుందని హెచ్చరించారు. జనాలు మాత్రం వినకపోవడం గమనార్హం. సభ్యసమాజం తలిదించుకునేలా ఇలా ఒంగోలు వాసులు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.