Hand Transplantation: భారతీయ వైద్య చరిత్రలో ఢిల్లీ డాక్టర్లు ఓ అద్భుతాన్ని సృష్టించారు. ఘోర ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఒక చిత్రకారుడి కథ ఇప్పుడు ఆశాజనక మలుపు తిరిగింది. జీవితంలో ఇక బ్రష్ పట్టుకోలేనని భావించిన సదరు పెయింటర్కు ఢిల్లీ డాక్టర్లు రెండు చేతుల్ని అమర్చారు. దేశంలోనే తొలిసారి హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ను సక్సెస్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవయవ దానం ఎంత గొప్పతో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఎంతో మంది అవయవ దానం ద్వారా మరికొందరు జీవితాల్లో వెలుగులు నింపారు.
తాజాగా ఈ జాబితాలో దక్షిణ ఢిల్లీ పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా కూడా చేరారు. ఇటీవల బ్రెయిన్ డెడ్ తో ఆమె చనిపోయారు. మరణం తర్వాత ఆమె తన మూత్రపిండాలు, కాలేయం మరియు కార్నియాలను మరో ముగ్గురికి డొనేట్ చేశారు. అయితే మీనా మెహతా చేతులను డాక్టర్లు ఓ పెయింటర్ కు ఫిక్స్ చేశారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఈ హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది.
45 ఏళ్ల సదరు పెయింటర్ 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. నిరుపేద నేపథ్యం నుండి వచ్చిన అతను జీవితాన్ని ముగించాలి అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ డాక్టర్లు అతనికి మళ్లీ పెయింటింగ్ బ్రష్ పట్టుకునే అవకాన్ని కల్పించారు. మీనా మెహతా చేతులను దాదాపు 12 గంటలు శ్రమించి సదరు వ్యక్తికి అమర్చారు. డోనార్, రిసిపియంట్ చేతులకు చెందిన అన్ని నరాలు, కండరాలను కలిపారు.
ఫైనల్ గా డాక్టర్లు పడ్డ శ్రమకు ఫలితం దక్కింది. హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయింది. త్వరలోనే సదరు చిత్రకారుడు మళ్లీ తన జీవనాధారమైన పెయింటింగ్ బ్రష్ను పట్టుకోబోతున్నాడు. రేపే సదరు వ్యక్తిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా చేయబోతున్నారు. ఢిల్లీ డాక్టర్ చేసిన ఈ అరుదైన సర్జరీ గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్య బృందం యొక్క అంకితభావం మరియు నైపుణ్యానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.