జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం, ఇతర పార్టీల రూపంలో కాకుండా కోర్టుల రూపంలో తలనొప్పులు వస్తున్నాయి. జగన్ స్వీయ తప్పిదాలో.. అధికారుల అత్యత్సాహమో.. ఆ పార్టీ నాయకుల అతి భజనో కానీ.. జగన్ నిర్ణయాలు కోర్టుల్లో బెడిసి కొడుతున్నాయి. కొన్ని అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా కోర్టుల వద్ద బోర్లా పడుతున్నాయి. అయినా.. కోర్టులపై పోరు ఆపడం లేదు. తాజాగా.. ఏపీ హైకోర్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో ఇచ్చింది. దీంతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం జగన్ భావిస్తున్నారట.
ఇప్పుడు అధికారులు మూడు రాజధానుల అంశంపై అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని హస్తినకు బయలుదేరుతున్నారు. మూడు రాజధానుల అంశంపై గవర్నర్ ఆమోదం తెలిపినా హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టుని ఛాలెంజ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టు తెలుస్తోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులు పాస్ చేయించుకోవడానికి జగన్ ప్రభుత్వం ఇప్పటికే చాలా కష్టపడింది. గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత కూడా రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. హైకోర్టు ఉత్తర్వులతో పెద్ద షాకే తగిలింది.
దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని తన సొంత అవసరాల కోసమకే రాజధాని అంటూ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అమరావతి ఉద్యమం రాజకీయంగా ఒక బూటకం అని విమర్శించారు. రాజధాని తరలింపు విషయంలో ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లయినా సరే మూడు రాజధానుల బిల్లును పాస్ చేయించుకుంటామని అంటున్నారు. అయితే.. నిమ్మగడ్డ విషయంలో సుప్రీంకోర్టు జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈసారి మూడు రాజధానుల బిల్లుకి మద్దతు తెలుపుతుందో.. రైతుల వైపు తీర్పును ఇస్తుందో వేచి చూడాలి.