ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వాన్ని విమర్శించకుంటే పబ్లిసిటీ ఎలా వస్తుందని ఆలోచించాడు ఏమో ఏపీ బిజెపి కొత్త చీఫ్ సోము వీర్రాజు పాచిపోయిన ఒక సబ్జెక్టుపై స్పందించి తన ఉనికి చాటుకున్నారు.
జగన్ ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానంపై ఆయన కొన్ని విమర్శలు చేసి నేనూ ఉన్నాను అనిపించుకున్నారు.ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.నిజానికి ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి రెండు వారాలు దాటిపోయింది. ఆ విధానానికి ఏపీ కేబినెట్లో ఆమోదం తెలిపారు.కొత్త పారిశ్రామిక విధానంలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారికి ప్రోత్సహాకాలు తగ్గించడంపై టీడీపీ సహా పలు పార్టీల నేతలు మండిపడ్డారు.
వారి విమర్శలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు దాదాపు ఆ విషయాన్ని అందరు మరచిపోయారు కూడా అయితే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు కి ఈ సబ్జెక్టు దొరికింది.వెంటనే ఈ అంశంపై ఆయన స్పందించారు . ఏపీ నూతన పారిశ్రామిక విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని గొంతెత్తారు. 2015-20 పారిశ్రామిక విధానంలో వున్న రాయితీలను తీసేశారని.. సబ్సిడీ శాతాన్ని 45 శాతం నుండి 35 శాతానికి తగ్గించారని మండిపడ్డారు.
గతంలో రూ.75 లక్షలు గరిష్టంగా ఉన్న సబ్సిడీ 50 లక్షలకు తగ్గించారని..నూతన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవని,ఈ విధానం అమలైతే కొత్తగా పరిశ్రమలు కూడా రావని రాజుగారు ధ్వజమెత్తారు నిజానికి సోము వీర్రాజు సరిగ్గానే మాట్లాడారు ఆయన చెప్పినవన్నీ నిజాలే.కాకుంటే ఆయన ఈ విధానంపై స్పందించిన సమయమే విచిత్రంగా ఉంది.ఎప్పుడో జరిగిపోయిన ఈ వ్యవహారంపై వీర్రాజు ఇంతాలస్యంగా ఇప్పుడెందుకు స్పందించారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది .
సోము వీర్రాజు కొద్దిగా వైసిపి ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటున్నారని బిజెపి లోని ఆయన వ్యతిరేకులు హైకమాండ్ కి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఆదరాబాదరాగా సోము వీర్రాజు జగన్ ప్రభుత్వ పాలసీ నొకదాన్ని విమర్శించేసి తానేమీ జగన్ కు సానుకూలం కాదని కలరింగ్ ఇచ్చుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు._