ఎపిలో బిజెపి వ్యూహమేమిటో సాధారణంగా ఎవరికి ఓ పట్టాన అంతుబట్టడం లేదు. పాత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపికి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు
అన్న ఉద్దేశంతో పక్కన పెట్టారా, టిడిపికి వ్యతిరేకంగా ఉండే సోము వీర్రాజును తీసుకువచ్చి అధ్యక్షుడుగా చేశారా వైసిపితో అంతర్గతంగా ఒప్పందం ప్రకారం నడుచుకుంటున్నారా టిడిపిని పతనం చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా అనే అంశాలు అనేక ప్రశ్నలుగా తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నల్లో ఏ ఒక్క దానికి సమాధానం దొరికినా అన్ని దొరికేసినట్లే. అందుకే వైసిపిని రాజకీయంగా ఘాటుగా, పెద్దగా బిజెపి నేతలు ఎవ్వరూ విమర్శించడం లేదు. ఆ పార్టీ నాయకులు అధ్యక్షుడు సోము వీర్రాజు అయినా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అయినా, రామ్ మాధవ్ అయినా సున్నితమైన, సహేతుకమైన విమర్శలు మాత్రమే చేస్తున్నారు. గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాదిరిగా ఘాటుగా రాజకీయ హీట్ రేకెత్తించేలా ఒక్క వ్యాఖ్య చేయడం లేదు. అందుకు ఉదహరణ గానే తాజాగా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసిపి ప్రభుత్వ విధానంపై ఓ వ్యాఖ్య చేశారు. వ్యతిరేకంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అది కాస్త గమ్మత్తుగానూ అనిపించింది. ఇంతకూ ఆ ప్రకటనలో మేటర్ ఏముంది అంటే….
నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలు ఏవీ రావంట
వైసిపి ప్రభుత్వం జివో 39 ద్వారా వైసిపి ప్రభుత్వం తెస్తున్న నూతన పారిశ్రామిక విధానం 2020 -23తో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు సోము వీర్రాజు. ఈ వర్గాలకు గత పారిశ్రామిక పాలసీలో ఉన్న కొన్ని రాయితీలు తీసేశారని అన్నారు. కొన్ని 45 శాతం నుండి 35 శాతంకు తగ్గించారని పేర్కొన్నారు,. గతంలో పరిశ్రమ పెట్టిన ఆరేళ్లలో రాయితీ వచ్చేదని , ఇప్పుడు మూడేళ్ల నుండి అయిదేళ్ల వరకూ విజయవంతంగా నడిస్తేనే రాయితీ ఇచ్చేలా నూతన పాలసీ తేవడం సరికాదని అన్నారు. గతంలో రూ.75 లక్షల గరిష్టంగా ఉన్న రాయితీని రూ.50 లక్షలకు తగ్గిచారన్నారు. అదే విధంగా సేవా రంగానికి రాయితీలు పూర్తిగా ఎత్తివేశారని సోము వీర్రాజు పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలకు ప్రోత్సహించేదిగా నూతన పారిశ్రామిక పాలసీ లేకపోవడం వల్ల కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం లేదనీ, దీంతో ఉద్యోగ కల్పనకు అవకాశమే ఉండదనీ వ్యాఖ్యానించారు సోము వీర్రాజు.
కర్ర విరగకూడదు – పాము చావకూడదు అన్న బాపతులో బిజెపి
ఏపిలో బిజెపి వ్యవహారం అంతా భిన్నంగా సాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడకూడదు. అలాగని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించకూడదు. టిడిపిని పూర్తిగా పతనం చేయాలి. అలాగని వైసిపిని పూర్తిగా ఎంకరేజ్ చేసినట్లు ఉండకూడదు. ప్రజా సమస్యలపై గళం ఎత్తాలి. కానీ ప్రభుత్వానికి దూరం అవ్వకూడదు. ఇలాంటి విడ్డూరమైన, గమ్మత్తైన కండీషన్ లు పెట్టుకొని ఓవరాల్ గా కర్ర విరగకూడదు – పాము చావకూడదు అన్న రీతిలో బిజెపి వ్యవహరిస్తున్నది. ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలు కూడా అలాగే ఉంటున్నాయి. తాజా గా సోము వీర్రాజు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.