పోలీసు వ్యవస్థ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా గుండెకాయ వంటిది.పోలీసు శాఖలో ప్రభుత్వంపై అసంతృప్తి పొడసూపితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.
ప్రస్తుతం v ప్రభుత్వం విషయంలో పోలీసు శాఖ కొద్దిగా అసంతృప్తిగా ఉందంటున్నారు.ఆంధ్రప్రదేశ్లో దళితులపై వరుసగా జరుగుతున్న దాడుల ఘటనల్లో వైసీపీ నేతల్ని కాపాడటానికి పోలీసుల్నే బలి పశువులు చేస్తున్న వైనం ఇందుకు ప్రధాన కారణం.చివరకు ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఘటనల విషయంలో పోలీసులనే తప్పు పట్టడంతో వారు లోలోపల రగిలిపోతున్నారట.తాజాగా సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో పోలీసుల వ్యవహార శైలి పట్ల తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
పోలీసులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ఆయన ఆశ్చర్యపోయారు. హోంమంత్రి ఎస్సీ.. డీజీపీ ఎస్టీ అయినా ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలని హితవు పలికారు. దళితుల మీద దాడులు చేసే పోలీసులను సీఎం జగన్ గట్టిగా హెచ్చరించారు. అరెస్టులు సైతం జరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు.ఇదే పోలీసులకు నచ్చలేదు. తమకేమి ప్రత్యేకంగా దళితులపై కోపమంటూ ఉండదని అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే కొన్ని సందర్భాల్లో అవుటాఫ్ ది వే వెళతామని,అయితే ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులను బలిపశువులను చేసి సొంత పార్టీ నేతలను కాపాడుకోవటం సరైన విధానం కాదని పోలీసు సంఘం చెబుతోంది.
ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసును ఉదహరించక తప్పదు. శిరోముండనం ఘటనలో ట్రైనీ ఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. దానికి కారణం ఓ వైసీపీ నేత. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఓ వైసీపీ నేతను అడ్డుకున్నందుకు వరప్రసాద్ను కొట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ వైసీపీ నేతల ప్రోద్భలంతోనే ట్రైనీ ఎస్ఐ ఆ యువకుడికి శిరోముండనం చేయించాడు.
ఈ విషయంలో చాలా పెద్ద పెద్ద పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందుకే పోలీసులు లైట్ తీసుకున్నారు. రాష్ట్రపతి స్పందించాక తీరిగ్గా ఈ ఘటనపై రియాక్ట్ అయిన సీఎం తప్పు అంతా పోలీసులపై నెట్టేశారు. తన పార్టీ నేతల వరకూ రానివ్వలేదు. ఒక్క ప్రసాద్ విషయంలోనే కాదు… శ్రీకాకుళం జిల్లాలో ఓ దళితుడి గుండెపై కాలుతో తన్ని మరో అధికారి వ్యవహారంలోనూ వైసీపీ నేతలదే తప్పు. దళితులపై జరిగిన అనే దాడుల ఘటనల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదులున్నా దాన్ని పట్టించుకోకుండా పోలీసుల్ని సిఎం వేలెత్తి చూపడం అనేది ప్రమాదకరమైన పోకడగా పరిశీలకులు భావిస్తున్నారు.