అధికారంలో ఉన్న వైసీపీ బలం 151 మంది ఎమ్మెల్యేలు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. మిగిలిన ముగ్గురూ పరోక్షంగా వైసీపీ మద్దతుదారులుగా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు అరెస్టుల భయంలో ఉన్నారు. లోకేశ్ ట్విట్టర్ కు పరిమిమైతే.. చంద్రబాబు జూమ్ కు పరిమితమయ్యారు. అయినా.. సీఎం జగన్ ను చంద్రబాబు విపరీతంగా విసిగిస్తున్నారని అంటున్నారు. జగన్ చేయాలనుకున్న ప్రతి పనికి అడ్డు తగులుతున్నారట. ఇళ్ల పట్టాల పంపిణీకి చంద్రబాబే అడ్డు తగులుతున్నారని సీఎం జగనే అంటున్నారు. ఈమేరకు జరిగిన ఓ కీలక సమావేశంలో జగన్ వ్యాఖ్యలివీ..
చంద్రబాబు గురించి జగన్ ఏమన్నారంటే..
‘ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు. ఎక్కడ వైసీపీ ప్రభుత్వానికి పేరొస్తుందోననే భయంతో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారు. ఓ మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆటంకాలు ఎదురైనా చివరకు మంచే జరుగుతుంది.. ఇళ్ల పట్టాల పంపిణీకి మంచి రోజు వస్తుంది. ఈ సమయాన్ని అందరం సద్వినియోగం చేసుకుందాం. భూమికి సంబంధించి సమస్యలు పరిష్కరించండి. లేఅవుట్స్ లో మొక్కలు నాటడం. లబ్దిదారులు ఫొటోలు సేకరణ, స్థలం సరిహద్దులు.. ఇలా ప్రతి అంశాన్ని కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించి పనులు జరిపించండి’ అని సీఎం జగన్ అన్నారు.
క్షేత్రస్థాయిలో కారణాలు వేరే ఉన్నాయిగా.. జగన్ గారూ..
తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి టీడీపీ కంటే వైఎస్సీర్పీపీ ఎమ్మెల్యేలే లబ్దిదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాజమండ్రిలోని అవ భూములు, అమరావతి భూముల్లో, ప్రకాశం జిల్లా కనిగిరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో కూడా లబ్దిదారుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. ఊరికి దూరం కావటం, వివాదాస్పద భూములు కావడంతో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రతిపక్షం, కోర్టులు, లబ్దిదారుల నుంచి కూడా అరోధాలు ఏర్పడుతున్నాయి. కానీ సీఎం జగన్ ఓ అంతర్గత సమావేశంలో ఈ విషయానికి పొలిటికల్ హీట్ రగిలించారు. దీనిపై చంద్రబాబు నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో చూడాల్సి ఉంది.