జగన్ పాలనకు కన్ను, ముక్కు, చెవులు, వెన్నెముక అన్నీ వాలంటీర్లే..! జగన్ కలలు గన్న స్థానిక పాలనకు ఈ వ్యవస్థ ద్వారానే బీజం వేశారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ఆ వేదిక మీదనే ఈ వ్యవస్థ ద్వారానే పాలన సాగిస్తానంటూ ఉద్యోగాలను ప్రకటించి, ఏడాది కాలంగా సాగిస్తున్నారు…!
మరి ఏడాదిలో ఈ పాలన ఎలా ఉంది..? ఈ వాలంటరీ వ్యవస్థ పని తీరు ఏ విధంగా సాగుతుంది..? జగన్ అనుకున్న ఫలితాలు వస్తున్నాయా, లేదా? గాడి తప్పితే ఎక్కడ తప్పింది..? ఎందుకు తప్పింది..? అనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!
పని తీరు ఎలా ఉంది..??
వాలంటరీ వ్యవస్థ పని తీరుని ముందుగా చెప్పుకుందాం. క్షేత్రస్థాయిలో పథకాల అమలు, సర్వే, ఇంటింటి అధ్యయనం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల మదింపు అన్నీ వాలంటీర్లే చూసుకోవాల్సి ఉంది. నిజానికి వాలంటరీ వ్యవస్థ అప్పుడప్పుడే గాడిలో పడుతుంది, జనానికి అలవాటు అవుతుంది, వాలంటీర్లకు కూడా పాలనపై, పనితీరు బాధ్యతలపై అవగాహన వస్తుంది అనుకునే దశలో కరోనా మొదలయింది. అప్పటికే కొన్ని జిల్లాలో వాలంటీర్లపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు.., కొన్ని తీసివేతలు, కూడికలు జరిగాయి.
* కరోనా వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మరింత కీలకం అయింది. ఇంటింటికీ తిరగడం.., కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆరా తీయడం.. నమూనాల సేకరణ.. రేషన్ పంపిణి.., పింఛన్లు పంపిణి… ఇలా ప్రతీ కీలకైనా విధులు నిర్వర్తించారు.
* కరోనా మార్చిలో ఎంటర్ అయితే దాదాపు మే నెల వరకు రాష్ట్రంలో వాలంటీర్ల విధులపై సర్వత్రా సంతోషం వ్యక్తం అయింది. చురుగ్గా పని చేసారు. ఆ సమయంలో “సాక్షి” పత్రికలో పెద్ద పెద్ద ఆర్టికల్లు కూడా రాశారు. జగన్ గాంరి విజయం, వాలంటీర్ల వ్యవస్థ గొప్పతనం కారణంగా దేశంలో మన రాష్ట్రంలోనే తక్కువ కేసులు, పాజిటివ్ రేటు. టెస్టులు అనుకుంటూ డబ్బా కొట్టారు.
* కానీ జూన్ నుండి కరోనా విజృంభించడం.., వాలంటీర్లకు కరోనా సోకడంతో ఇక పనితీరు తగ్గింది. వారిలోనూ భయం మొదలయింది. వాలంటీర్ల ప్రభావం కరోనా కట్టడిలో పెద్దగా ఫలితం లేదని తేలిపోయింది. నాడు డబ్బా కొట్టిన సాక్షి కూడా చేతులెత్తేసింది.
* అలా పనితీరు విషయంలో వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా సఫలం కాలేదు. అలా అని విఫలం కూడా కాలేదు. మిశ్రమ పనితీరు కనబర్చారు.
అవినీతి ఆరోపణలు షురూ..!!
పని తీరు విషయం అలా ఉంటె ఇక వాలంటీర్లపై అవినీతి ఆరోపణలను కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. జీతం రూ. 5 వేలు మాత్రమే. అది కూడా నెల నెల సక్రమంగా ఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. పాపం.. సేవ మాత్రం ఎక్కువ ఉంది. నెలలో ఎప్పుడంటే అప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి. ఎవరు పిర్యాదు చేసినా విచారణకు వెళ్ళాలి. బాధలు తీర్చాలి. పథకాలు అందించాలి. మండల కార్యాలయాలకు తిరగాలి. ఎప్పుడంటే అప్పుడు మీటింగులకు వెళ్ళాలి. ఇన్ని చాకిరీలు చేస్తున్నప్పుడు చేతిలో చమురు పడాలి కదా..!! జీతం ఇవ్వకుండా చేయాలంటే ఏం చేస్తారు? ఎందుకు చేస్తారు..? అందుకే చిలక్కొట్టుడులు బాగానే జరుగుతున్నాయి. బయటపడితే పోతున్నారు. బయటకు రాకపోతే ఉంటున్నారు. “5 వేలు జీతం, పైగా చాకిరీ పెద్ద జాబ్ ఏమి కాదు. ఉంటె ఎంత ? పోతే ఎంత?” అనే ధోరణిలో చాల వరకు వాలంటీర్లు ఉన్నారు.
* విజయనగరం జిల్లాలో ఓ గ్రామంలో వాలంటీర్లు ఇద్దరు కలిసి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
* ప్రకాశం జిల్లా కారంచేడులో ఓ వికలాంగుడుకి పింఛను ఇప్పించడానికి రూ. 8 వేలు లంచం డిమాండ్ చేసి ఓ వాలంటీర్ అడ్డంగా దొరికిపోయాడు.
* ప్రకాశం జిల్లా కందుకూరు పక్కన లింగసముద్రంలో ఓ గ్రామ వాలంటీర్లు పక్క గ్రామంలోకి వెళ్లి మీకు పథకాలు ఇప్పిస్తాం అంటూ 15 మంది మహిళలు ఒక్కొక్కరి వద్ద రూ. 5 వేలు డిమాండ్ చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు. * గుంటూరు జిల్లాలో వాలంటీర్లు ఆఫీస్ లోనే మందు కొడుతూ దొరికిపోయారు.
* ఇలా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పాలనలో ప్రక్షాళన తీసుకు వద్దాం అనుకున్న సీఎం జగన్ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరేవేరడం లేదు. వారికి పనికి తగిన వేతనం, సరైన సమయానికి అందిస్తే.. కొంత మేరకు ప్రక్షాళన చేస్తే జగన్ అనుకున్న లక్ష్యంలో కొంత నెరవేరే అవకాశం ఉంది.