బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల విచారణ ఎదుర్కొన్న ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పోలీసు కస్టడీ ముగిసింది. నేడు అఖిలప్రియ ను న్యాయమూర్తి ముందు హజరుపర్చాల్సి ఉన్న నేపథ్యంలో బోయినపల్లి పోలీసులు ఆమెకు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తొలుత కరోనా పరీక్షల నిర్వహణ కోసం అంటూ పాటిగడ్డ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కు అఖిలప్రియను తీసుకువెళ్లి అక్కడ కరోనా పరీక్షలు చేయించారు. అనంతరం ఆమెను గాంధీ అసుపత్రికి తీసుకువెళ్లారు. మీడియా దృష్టి మరల్చడానికే పిహెచ్ సీకి తీసుకువెళ్లినట్లు భావిస్తున్నారు.
అఖిలప్రియ పోలీస్ వాహనం ముందు వెనుకా ఎస్కార్ట్ విమెన్ పోలీసులు ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం అఖిలప్రియ ను మారేడ్ పల్లి లోని న్యాయమూర్తి ముందు హజరుపరుస్తారు. అనంతరం ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. న్యాయమూర్తి అనుమతితో మూడు రోజులుగా అఖిలప్రియను పోలీసులు కస్టడీలోకి విచారణ చేశారు. విచారణలో పోలీసులు దాదాపు 300 ప్రశ్నలు ఆమెను సంధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్, చంద్రహాస్, గుంటూరు శ్రీనుల ఆచూకీ పోలీసులకు లభించిందనీ మరి కొద్ది గంటల్లో అదుపులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి..పొగమంచు తో పరేషాన్..! విమాన సర్వీసులకు అంతరాయం..!!