BJP: తెలంగాణలో గత కొద్దికాలంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయ విమర్శలు, మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబ్బాక ఎన్నికల్లో విజయంతో బీజేపీ దూకుడు మీద ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కూడా బీజేపీ విజయం సాధిస్తుంది అని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ విమర్శలను ఘాటుగా చేస్తున్నారు. తాజాగా ఓ కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాదే గెలుపు…
బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుండి వచ్చే నిధులతోనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించిన జితేందర్ రెడ్డి.. వ్యవసాయ రంగం, విద్య, వైద్యం, రోడ్లకు అన్నింటికీ కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.. గ్రామాల్లో 15వ ప్రణాళిక సంఘం పేరుతో వచ్చే నిధులతోనే పనులు జరుగుతున్నాయి.. వలస కూలీలకు ఉపాధి హామీ పథకం పేరుతో నేరుగా డబ్బులు ఇస్తుందని.. కేసీఆర్ ఇచ్చే గోర్లు, బర్లు, చేపలు పెంపకానికి కూడా కేంద్రం నిధులు ఇస్తుందని.. బొమ్మ మాత్రం కేసీఆర్ పెట్టుకొని పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. రూ. 4 వేల కోట్లు లైఫ్ స్టాక్ కోసం ప్రతి ఏడాది కేంద్రం ఇస్తుందని జితేందర్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు, మిషన్ భగీరథ ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాలేదని విమర్శించారు.
కోదండరాం గురించి ఏమంటున్నారంటే…
ఈ ఎన్నికల్లో కోదండరాం ఎందుకు పోటీ చేస్తున్నారు, ఎం చేస్తారు? అని బీజేపీ నేత ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏరోజు ఎవరికోసం పని చేయలేదు.. కేసీఆర్ చుట్టూ తిరగడం తప్ప అని ఎద్దేవా చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి , విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో, 30 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నారని తెలిపారు. పట్టభద్రులు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే, కేంద్రం నిధులు పక్కదార పట్టకుండా ఆపాలి అంటే బీజేపీ అభ్యర్థులు గెలవాలన్నారు. స్వతంత్రులకు ఇలా ప్రశ్నించే అవకాశం లేదన్నారు. యువత మొత్తం బీజేపీతోనే ఉన్నారని వరంగల్ నగరంలో మేయర్ బీజేపీ గెలుస్తుంది.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు రాష్ట్రం మొత్తం రిపీట్ అవుతాయన్నారు.