YS Sharmila : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వైపు తనదైన పరిపాలనతో ముందుకు సాగుతుంటే… ఇదే సమయంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల అనూహ్య రీతిలో పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజన్న రాజ్యం పేరుతో తెలంగాణలో తన సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈ గేమ్ ప్లాన్ లో ప్రధానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ అవుతున్నారని అంటున్నారు.
షర్మిలమ్మ నినాదంతో…
తెలంగాణలో రాజన్న రాజ్యం ఏర్పాటు గురించి వైఎస్ షర్మిల పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇతర పార్టీల నేతల కంటే వైసీపీ నేతలే షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదిగా తెలంగాణ వైసీపీ క్యాడర్కు భవిష్యత్పై భరోసా లేని పరిస్థితి ఉందంటున్నారు. తెలంగాణలో ఇక పార్టీ యాక్టివ్గా ఉండదని, పార్టీ పేరుతో కార్యక్రమాలు చేయడం వృథా అని వారు భావిస్తున్నట్లు చెప్తున్నారు. వైసీపీలో కీలకంగా పనిచేసిన కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి లాంటి నాయకులు షర్మిల అనుచరులుగా మారడం చూస్తుంటే వైసీపీకి ప్రధానంగా షర్మిల పార్టీ దెబ్బ కొడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వైసీపీ నేతల ఫీలింగ్ ఏంటో…
ప్రచారంలో ఉన్న ప్రకారం అన్నా చెల్లెళ్ల మద్య రాజకీయ వైరుధ్యం పక్కన పెడితే … వైసీపీ క్యాడర్కు షర్మిల పార్టీ ఊపిరిపోసినట్లయ్యింది. ఎలాగూ తెలంగాణలో పార్టీ విస్తరణపై జగన్ సీరియస్గా ఉన్నట్లు కనిపించని నేపథ్యంలో ఆ పార్టీ నేతలు షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.