Raghurama krishnam Raju Bail: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కాలికి తగిలిన దెబ్బ లపై సుప్రీంకోర్టు.. ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల న్యాయస్థానాల కీలక అధికారుల పర్యవేక్షణలో వీడియో రూపంలో జరిగిన ఈ వైద్య పరీక్షల్లో .. రఘురామకృష్ణంరాజు కాలికి ఉన్న దెబ్బలు ఎప్పటినుండో ఉన్న దెబ్బలు కాదని, కొద్ది రోజుల క్రితం తగిలిన దెబ్బలు అని మెడికల్ రిపోర్టు లో బయటపడినట్లు సమాచారం. తాజా వార్త తో ఏపీ రాజకీయాలు మాత్రమే కాక జాతీయ స్థాయిలో ఈ వార్త సంచలనంగా మారింది.
దీంతో సుప్రీంకోర్టు బాధ్యతగల పార్లమెంటు సభ్యుడు పై పోలీసులు చేయి చేసుకోవడం పట్ల ఏవిధంగా ప్రతి స్పందిస్తుందో అన్న టెన్షన్ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో నెలకొన్నట్లు టాక్. తాజా పరిణామంతో ఒక్కసారిగా వచ్చిన ఒత్తిడి మేరకు మరికొద్ది గంటల్లో రఘురామకృష్ణంరాజు కి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లే అని మెడికల్ రిపోర్ట్ పై వస్తున్న వార్తలపై విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బాధ్యత గల పార్లమెంటు సభ్యుడిపై పోలీసులు చెయ్యి చేసుకోవటం పట్ల సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీయడానికి ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలతో కుట్ర పన్నినట్లు రఘురామకృష్ణంరాజు ని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే అరెస్టు చేసిన తర్వాత రోజు న్యాయస్థానంలో ప్రవేశం పెట్టిన టైమ్లో తనను పోలీసులు కొట్టినట్లు న్యాయమూర్తికి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఆ సమయములో రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రఘురామకృష్ణం రాజు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. రఘురామకృష్ణంరాజు కి తగిలిన దెబ్బల పై .. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయాలని సూచించడం జరిగింది. ఇదే క్రమంలో పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని .. ఈ బెయిల్ కేసు 21వ తారీకు వాయిదా వేసింది. దీంతో తాజా పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.