అమరావతి, మార్చి 21: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. విశాఖ జిల్లా గాజువాక నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11గంటలకు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గాజువాకలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు అనందపురం పూల మార్కెట్ వద్ద నిర్వహించే బహిరంగ సభలో, సాయంత్రం ఐదుగంటలకు ఆర్టిసి కాంప్లెక్స్ సమీపంలోని పాత జైలు రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి శుక్రవారం ఉదయం పులివెందులలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. అనంతరం పులివెందుల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తదుపరి సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించేందుకు కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం కారణంగా గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనరని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.