పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక
భారతదేశంతో జాగ్రత్త అని సూచన
వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా హెచ్చరించింది. భారతదేశంపై మరో ఉగ్రవాద దాడి చేస్తే మాత్రం పరిస్థితి చాలా సమస్యాత్మకంగా మారుతుందని తెలిపింది. ముఖ్యంగా జైషే మహ్మద్, లష్కరే తాయిబా లాంటి ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా యంత్రాంగంలోని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉండకూడదంటే ఈ చర్యలు తప్పనిసరన్నారు. ఉగ్రవాద బృందాలపై పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేయకపోతే, అది ఆ దేశానికి చాలా ప్రమాదకరం అవుతుందని.. ఉద్రిక్తతలు ఎవరికీ మంచిది కాదని తన పేరు బయట పెట్టేందుకు ఇష్టపడని ఆ అధికారి అన్నారు.
బాలాకోట్ ప్రాంతంలో భారత ఫైటర్ జెట్ విమానాల దాడి తర్వాత పాకిస్థాన్ తీసుకున్న చర్యలపై ప్రశ్నించగా, ఉగ్రవాద బృందాలపై అమెరికా, అంతర్జాతీయ సమాజం కూడా చర్యలు తీసుకోవాలన్నారు. పాక్ చర్యలపై అప్పుడే అంచనా వేయడం సరికాదని తెలిపారు. పాక్ ఇప్పుడిప్పుడే కాస్త స్పందిస్తోందని, కొన్ని ఉగ్రవాద సంస్థల ఖాతాలు స్తంభింపజేసి, కొందరిని అరెస్టు చేశారని అన్నారు. అయితే అది ఏమాత్రం చాలదని, గతంలోనూ కొందరిని అరెస్టు చేసినా వెంటనే విడుదల చేసేశారని గుర్తుచేశారు. ఉగ్రవాదులు దేశంలో ప్రయాణిస్తూ, ర్యాలీలు కూడా చేస్తున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్ మీద ఒత్తిడి పెంచేందుకు అమెరికా తన అంతర్జాతీయ మిత్రులతో కలిసి పని చేస్తుందన్నారు.
పాకిస్థాన్ తనను తాను ఒక బాధ్యతాయుతమైన దేశంగా నిరూపించుకోవాలని ఆయన హెచ్చరించారు. లేని పక్షంలో ఆర్థిక దిగ్బంధనం తప్పదని, ఇప్పటికే ఆ దేశం కష్టాల్లో ఉందని అన్నారు. ఏ విషయమూ నిర్ణయించుకోవాల్సింది మాత్రం పాకిస్థానేనన్నారు. పొరపాటున మరోసారి ఉగ్రవాద దాడి జరిగితే మాత్రం చాలా త్వరగా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్ లలో ఎవరు సైనిక చర్య ప్రారంభించినా నష్టం అపారంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న భారతదేశంలో జరిగిన ఉగ్రదాడితో పాకిస్థాన్ ఇప్పటికీ ఉగ్రవాద బృందాలకు సురక్షిత ప్రాంతంగానే ఉందని అర్థమవుతోందన్నారు.